పెట్రో ధరల పెంపుపై నవంబరు 14 నుంచి కాంగ్రెస్ నిరసనలు

ABN , First Publish Date - 2021-10-24T23:04:35+05:30 IST

పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై నవంబరు 14 నుంచి 29

పెట్రో ధరల పెంపుపై నవంబరు 14 నుంచి కాంగ్రెస్ నిరసనలు

న్యూఢిల్లీ : పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై నవంబరు 14 నుంచి 29 వరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ, ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా  మొదటి వారంలో దేశవ్యాప్తంగా తమ పార్టీ నేతలు ఎవరి ప్రాంతాల్లో వారు పాదయాత్రలు నిర్వహిస్తారన్నారు. 


కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం చెన్నైలో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. భారతీయ రిజర్వు బ్యాంకు సూచించినట్లుగా పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడానికి కారణం కేంద్ర ప్రబుత్వ దురాశేనని చెప్పారు. పెట్రోలు బంకుల్లో వీటిపై తక్కువ పన్నులు విధించవచ్చునని ఆర్బీఐ చెప్పిందన్నారు. బంకుల్లో ధరలను తగ్గించాలని పదే పదే చెప్తోందన్నారు. 


కాంగ్రెస్ ఉత్తర ప్రదేశ్ శాఖ ఇన్‌ఛార్జి ప్రియాంక గాంధీ వాద్రా ఆదివారం ఓ ట్వీట్‌లో, ప్రజలను ఇబ్బంది పెట్టడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సరికొత్త రికార్డులు సృష్టించిందని ఆరోపించారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతుండటంపై మండిపడ్డారు. ఈ ధరలు ఈ ఏడాది రూ.23.53 పెరిగినట్లు చెప్తున్న ఓ మీడియా నివేదికను జత చేశారు. 


పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజు శనివారం కూడా పెరిగాయి. ఢిల్లీలో శనివారం లీటరు పెట్రోలు ధర రూ.107.24 కాగా, లీటరు డీజిల్ ధర రూ.95.97. 


Updated Date - 2021-10-24T23:04:35+05:30 IST