ధరల పెరుగుదలపై కాంగ్రెస్ ఉద్యమం ఈ నెల 14 నుంచి

ABN , First Publish Date - 2021-11-10T22:05:28+05:30 IST

ప్రజల నడ్డి విరిగేలా పెరుగుతున్న నిత్యావసర

ధరల పెరుగుదలపై కాంగ్రెస్ ఉద్యమం ఈ నెల 14 నుంచి

న్యూఢిల్లీ : ప్రజల నడ్డి విరిగేలా పెరుగుతున్న నిత్యావసర వస్తువులు, పెట్రో ఉత్పత్తుల ధరలపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నెల 14 నుంచి 29 వరకు జన జాగరణ్ అభియాన్ పేరుతో దేశవ్యాప్తంగా సామూహిక నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు బుధవారం ప్రకటించింది. అనూహ్యంగా పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా ప్రజా గళాన్ని బలోపేతం చేయడం కోసం ప్రజలను కలవబోతోంది. దండి మార్చ్‌ను గుర్తు చేసే విధంగా ఓ లోగోను రూపొందిస్తోంది. 


కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో, ద్రవ్యోల్బణం పరుగులు తీస్తోందని, పెరుగుతున్న ధరలు ప్రజల నడ్డి విరుస్తున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ విధ్వంసం, తీవ్ర ఆర్థిక మాంద్యం, అత్యధిక నిరుద్యోగం రేటు, వ్యవసాయ రంగ సంక్షోభం, పేదరికం స్థాయులు పెరుగుతుండటం, ఆకలి బాధలు పెచ్చుమీరడం వంటివాటికి తోడుగా పరుగులు తీస్తున్న ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల జత కలిశాయన్నారు. సీఎన్‌జీ, వంట గ్యాస్, డీజిల్, పెట్రోలు, కోకింగ్ ఆయిల్, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు మునుపెన్నడూ లేనంత తీవ్రంగా పెరిగాయన్నారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా ప్రజా గళాన్ని బలోపేతం చేయడం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు సాద్యమైనంత ఎక్కువ మంది ప్రజలను కలుస్తారని తెలిపారు. 


ఈ ఉద్యమం గురించి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని ఈ నెల 12 నుంచి ప్రారంభించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రజలను పెద్ద ఎత్తున కలిసేందుకు ఆ పార్టీ అత్యున్నత స్థాయి నేతలు సామాజిక మాద్యమాల్లో ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఉద్యమం కోసం ప్రజలు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి టోల్ ఫ్రీ నెంబరును ప్రకటించనున్నట్లు ఆ పార్టీ తెలిపింది.


Updated Date - 2021-11-10T22:05:28+05:30 IST