కాంగ్రెస్ లెక్కలన్నీ తప్పులతడకలే: కెప్టెన్ కౌంటర్

ABN , First Publish Date - 2021-10-03T02:14:15+05:30 IST

ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడంతో పార్టీలో తలెత్తిన పరిస్థితి తాజాగా మరింత..

కాంగ్రెస్ లెక్కలన్నీ తప్పులతడకలే: కెప్టెన్ కౌంటర్

చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన పరిస్థితి తాజాగా మరింత ముదిరింది. ఎమ్మెల్యేల మద్దతును కెప్టెన్ కోల్పోయారంటూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి హరీష్ రావత్, సీనియర్ నేత రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా చెప్పిన గణాంకాలపై   కెప్టెన్ అమరీందర్‌ శనివారంనాడు గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలో పూర్తి అయోమయం నెలకొందని, కనీసం గణాంకాలు చెప్పే విషంలోనైనా నేతల మధ్య సమన్వయం లేదని తాజాగా విమర్శలు గుప్పించారు. పార్టీలో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించలేక అసలు విషయానికి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం జరుగుతోందని తప్పుపట్టారు.


కాంగ్రెస్ నాయకత్వానికి ఎమ్మెల్యేలు లేఖ రాసినట్టు చెబుతున్నారనీ, అయితే ఎందరు లేఖ రాసారనే విషయంలో ఒక్కొక్కరూ ఒక్కో లెక్క చెబుతున్నారని, ఇది ఉద్దేశపూర్వకంగా అల్లుతున్న కథేనని, తప్పులతడక వ్యవహారమని కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. "43 మంది ఎమ్మెల్యేలు అధిష్టానానికి లేఖ రాసినట్టు హరీష్ రావత్ చెబుతున్నారు. 79 మందిలో 78 మంది ఎమ్మెల్యేలు నన్ను (కెప్టెన్‌ను) తొలగించాలని కోరినట్టు సూర్జేవాలా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలోని అందరూ సిద్దూ కామెడీ ట్రిక్స్‌లో పడినట్టు కనిపిస్తోంది. రేపో మాపో నాకు వ్యతిరేకంగా 117 మంది ఎమ్మెల్యేలు లేఖ రాసారని కూడా వాళ్లు చెప్పొచ్చు'' అని అమరీందర్ సింగ్ చమత్కరించారు. అబద్ధాలు చెప్పే విషయంలోనైనా నాయకుల మధ్య సమన్వయం లేకుండా పోయిందని ఎద్దేవా చేసారు.

Updated Date - 2021-10-03T02:14:15+05:30 IST