కాంగ్రెస్ అస్సామీలను వెర్రివాళ్లను చేస్తోంది : జేపీ నడ్డా

ABN , First Publish Date - 2021-03-23T22:28:37+05:30 IST

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను సకాలంలో అస్సాంలో అమలు చేస్తామని

కాంగ్రెస్ అస్సామీలను వెర్రివాళ్లను చేస్తోంది : జేపీ నడ్డా

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను సకాలంలో అస్సాంలో అమలు చేస్తామని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఈ చట్టం అమలుపై కాంగ్రెస్ అస్సామీలను వెర్రివాళ్ళను చేస్తోందని మండిపడ్డారు. ఈ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు. అస్సాం శాసన సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన తర్వాత మంగళవారం ఆయన మాట్లాడారు. 


సీఏఏను పార్లమెంటు ఆమోదించిందని జేపీ నడ్డా చెప్పారు. తాము అధికారంలోకి వస్తే, ఈ చట్టాన్ని అస్సాంలో అమలు కానీయబోమంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోందన్నారు. ఇటువంటి ప్రచారానికి కారణం కాంగ్రెస్ అజ్ఞానమైనా కావచ్చునని, లేదంటే రాష్ట్ర ప్రజలను వెర్రివాళ్ళను చేయాలనే ప్రయత్నమైనా కావచ్చునని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఆలోచనా ధోరణి గురించి తాను మాట్లాడదలచుకోలేదని చెప్పారు. కాంగ్రెస్ వైఖరి సమస్యాత్మకమైనదే కాకుండా రాష్ట్రానికి కూడా ప్రమాదకరమని చెప్పారు. 


అస్సాం గుర్తింపు వైష్ణవ స్వామీజీ శ్రీమంత శంకరదేవ, ‘భారత రత్న’ డాక్టర్ భూపేన్ హజారికా, ‘భారత రత్న’ గోపీనాథ్ బొర్డోలోయ్ వంటివారితో ముడిపడినదని చెప్పారు. దీనిని ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్‌తో ముడిపెట్టగలమా? అని ప్రశ్నించారు. అస్సాం గుర్తింపును, సంస్కృతిని పరిరక్షించడానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. శాసన సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. 


ఆ దేశాల నుంచి వచ్చినవారికి పౌరసత్వం

సీఏఏ ప్రకారం బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో మతపరమైన హింసను తట్టుకోలేక భారత దేశానికి వలస వచ్చినవారికి భారతీయ పౌరసత్వం ఇవ్వవచ్చు. 2014 డిసెంబరు 31న లేదా అంతకు ముందు మన దేశానికి వలస వచ్చి, కనీసం ఐదేళ్ళు నివసించినవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. 


Updated Date - 2021-03-23T22:28:37+05:30 IST