కాంగ్రెస్ అందుకే ఓడిపోతోంది: సీనియర్ నేత అజాద్

ABN , First Publish Date - 2020-11-22T23:28:30+05:30 IST

బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇలా మిగతా రాష్ట్రాల్లో జరిగిన అన్ని...

కాంగ్రెస్ అందుకే ఓడిపోతోంది: సీనియర్ నేత అజాద్

న్యూఢిల్లీ: బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇలా మిగతా రాష్ట్రాల్లో జరిగిన అన్ని ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. దాదాపు 60ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని నడిపించిన పార్టీ ఇప్పుడు అత్యంత దీనావస్థలోకి చేరుకుంది. అనేక చోట్ల డిపాజిట్లు కూడా దక్కడం లేదంటే ఇక ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం ఏంటి..? నిన్న, మొన్నటివరకు మేటి నాయకులుగా, ప్రజా నేతలుగా కీర్తించడబడిన రాజకీయ దురంధరులు, ఇప్పుడు దేనికీ పనికిరాకుండా పోతున్నారెందుకు..? ఇలాంటి ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సమాధానమిచ్చారు. 


ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆజాద్.. ఓటములతో తమ పార్టీ ఘోర పరాజయాలకు గల కారణాలను వివరించారు. ‘పరాజయాలతో మా పార్టీ ఆందోళన చెందుతోందనడం వాస్తవం. ముఖ్యంగా బీహార్ ఎన్నికలు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఓటమి పార్టీని తీవ్రంగా కలవరపెడుతోంది. దీనికి పార్టీ అధిష్ఠానం మాత్రం కాదు. లీడర్‌షిప్ అద్భుతంగా ఉంది. అందుకే నేను నాయకత్వాన్ని నిందించను. పార్టీని ప్రేమించి, పార్టీ కోసం శ్రమించేవారు కరువవ్వడం వల్లే పార్టీ బలహీనపడిందని నా భావన. దీనికి తోడు పోటీలో నిలబడే నేతలకు, కింది స్థాయి నాయకులకు మధ్య సంబంధాలు దెబ్బతినడం కూడా మా ఓటమికి కారణమేనం’టూ గులాం నబీ ఆజాద్ చెప్పుకొచ్చారు. 


ముఖ్యంగా పార్టీ తరపున ఎన్నికల టికెట్ పొందిన నేతలు ప్రజల్లో ఉండడం లేదని, టికెట్ పొందిన వెంటనే 5 స్టార్ హోటల్ బుక్ చేసుకుంటున్నారని, అక్కడే కూర్చుంటున్నారని, అలా అయితే గెలుపెలా సాధిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ మళ్లీ గాడిలో పడాలంటే నేతలు 5స్టార్ కల్చర్ వదిలేయాలని, ప్రజలతో మమేకం అవ్వాలని, వారికి అండగా ఉన్నామన్న నమ్మకం కలిగించాలని, వారి అవస్థలను తీరుస్తామన్న భరోసా ఇవ్వాలని సూచించారు. తమ నేతల్లో అదే కరువైందని, అందుకే పార్టీ వరుసగా ఓటములను చవిచూస్తోందని అజాద్ అన్నారు. 



Updated Date - 2020-11-22T23:28:30+05:30 IST