ఈడీ, సీబీఐలతో నన్ను భయపెట్టలేరు
ABN , First Publish Date - 2022-02-11T08:28:04+05:30 IST
ఈడీ, సీబీఐ తదితర దర్యాప్తు సంస్థలతో ప్రధాని మోదీ తనను భయపెట్టలేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
మోదీ చెప్పినట్టు నేను వినట్లేదు: రాహుల్
న్యూఢిల్లీ, మంగ్లౌర్, ఫిబ్రవరి 10: ఈడీ, సీబీఐ తదితర దర్యాప్తు సంస్థలతో ప్రధాని మోదీ తనను భయపెట్టలేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆయన అహంకారం వినోదభరితంగా ఉందన్నారు. బుధవారం ఏఎన్ఐ ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ ‘రాహుల్గాంధీ వినడు. సభలో కూర్చోడు’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ జిల్లా మంగ్లౌర్లో గురువారం రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘అవును.. ఆయన చెప్పినట్టు నేను వినట్లేదు. అది నిజం. మోదీ, ఆయన దర్యాప్తు సంస్థలంటే నాకు భయం లేదు. అందుకే ఆయన చెప్పినట్టు నేను వినట్లేదు’ అన్నారు. ‘ఉత్తరాఖండ్లో అధికార బీజేపీ అనేకమంది ముఖ్యమంత్రులను మార్చింది. ఒక దొంగను తొలగించి మరో దొంగను నియమించింది’ అని రాహుల్ విమర్శించారు. 70 ఏళ్లుగా దేశం ఏమీ సాధించలేదని మోదీ చెప్పినప్పుడల్లా, ఆయన అహంకారం బయటపడుతోందని, అదే నవ్వు తెప్పిస్తోందన్నారు.
‘అంటే గత 70 ఏళ్లుగా దేశం నిద్రపోయిందా? ఈయన అధికారంలోకి వచ్చాకే దేశం మేల్కొందా? మరి ఈ రోడ్లు, రైల్వే లైన్లు ఇంద్రజాలమా?’ అని ప్రశ్నించారు. కాగా.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే హిజాబ్ వివాదం తీసుకొచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ఆరోపించారు. ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం సమాజాన్నీ చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. తమ అసలు ఉద్దేశాలను దాచుకుని విషం చిమ్మేవారి అసలు ముఖాలను చూస్తే వారు దేశవ్యతిరేకులని తెలుస్తుంది’ అని వ్యాఖ్యానించారు.