రహస్య జీవోలు ఎన్ని?...ప్రజలకు నిజం చెప్పరా?: శైలజానాథ్
ABN , First Publish Date - 2021-07-23T17:56:41+05:30 IST
జగన్ అసమర్ధ పాలనలో రాష్ట్రం దివాళా తీస్తోందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు.
ఏలూరు: జగన్ అసమర్ధ పాలనలో రాష్ట్రం దివాళా తీస్తోందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ జీతాలు కూడా ఇవ్వలేరని, అప్పుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. బుగ్గన రాజేంద్ర తన పేరు బొంకు రాజేంద్రగా మార్చుకుంటే బెటర్ అని యెద్దేవా చేశారు. రహస్య జీవోలు ఎన్ని ఉన్నాయి.? ప్రజలకు నిజం చెప్పరా..? అని ప్రశ్నించారు. పెట్రో ధరల్లో దాదాపు రూ.60ల సెస్ విధిస్తున్నారని తెలిపారు. జగన్ ప్రభుత్వం అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారన్నారు. చెత్త పైన కూడా పన్నులు పెంచే చెత్త ప్రభుత్వం, చెత్త నాయకత్వం అని విమర్శించారు. అప్పు కోసం మోదీ కాళ్లపైనా, ఎవరి కాళ్లపైన అయినా పడుతున్నారని అన్నారు. సెంటు భూమి ఇచ్చి, పేదలను బురద నీళ్ళల్లో ఇళ్లు కట్టుకోమనడం దౌర్భాగ్యమన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఏపీ ప్రభుత్వం మొసలికన్నీరు కారుస్తుందని శైలజానాథ్ విమర్శలు గుప్పించారు.