వినతి పత్రం అందించిన కాంగ్రెస్ నాయకులు
ABN , First Publish Date - 2021-06-19T05:28:42+05:30 IST
ఆస్తి, నీటి పన్నులు పెంచడం, చెత్తపై పన్ను వసూలు చేయడం దారుణమని, వెంటనే ఉపసంహరించుకోవాలని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు.
కర్నూలు(అర్బన్), జూన్ 18: ఆస్తి, నీటి పన్నులు పెంచడం, చెత్తపై పన్ను వసూలు చేయడం దారుణమని, వెంటనే ఉపసంహరించుకోవాలని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో నగర మేయర్ బీవై రామయ్యను డీసీసీ అధ్యక్షుడు అహమ్మద్ అలీఖాన్తో కలిసి వినతి పత్రం అందించారు. అంతకుముందు నగరంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి బయలు దేరి నగర పాలక సంస్థ కార్యాలయం చేరుకుని నిరసన తెలిపారు. శైలజానాథ్ మాట్లాడుతూ దేశంలో కరోనా విజృంభన, పెట్రోల్ ధరల పెరుగదలతో పనులు లేక సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో 196, 197, 198 జీవోల ద్వారా పన్నులు పెంచి చివరకు చెత్త మీద కూడా పన్నులు విధించాలనే ఆలోచన చాలా దుర్మార్గమైందన్నారు. కేంద్ర వద్ద సీఎం జగన్ నిధులు తెచ్చుకోలేక రాష్ట్ర ప్రజలపై గతంలో ఎన్నడు లేని విధంగా ప్రజలపై భారం మోపడం దారుణమన్నారు. వెంటనే జారీ చేసిన జీవోలను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. డీసీసీ అధ్యక్షుడు అహమ్మద్ ఆలీఖాన్ మాట్లాడుతూ చెత్త పన్ను వసూలు జీవోను వెనక్కి తీసుకుని ప్రజలను ఆదుకోవాలని కోరారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగమధుయాదవ్, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్బాబు, జాన్ విల్సన్, దామెదర రాధాకృష్ణ, బాబురావు, క్రాంతినాయుడు, సజ్ఞాద్హుసేన్, పోతుల శేఖర్, అమరేంద్రరెడ్డి, ప్రమీలా, మద్దమ్మ, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
‘పేదలను ఆదుకోవడంలో విఫలం’
డోన్(రూరల్): పేదలను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. శుక్రవారం మండలంలోని ఓబులాపురం గ్రామ సమీపంలో ఉన్న వృద్ధాశ్రమంలో రాహుల్గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని అన్నదానం ఏర్పాటు చేశారు. పార్టీ నంద్యాల లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు లక్ష్మీనరసింహయాదవ్, ప్రధాన కార్యదర్శి గార్లపాటి మద్దిలేటి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. శైలజానాథ్ ముఖ్యఅతిథిగా హాజరై అన్నదానం చేశారు. పార్టీ నంద్యాల లోక్సభ నియోజకవర్గ కార్యదర్శి జనార్దన్, ప్రధాన కార్యదర్శి సునీత, డోన్ మండల అధ్యక్షుడు వడ్డె రాజశేఖర్, ప్యాపిలి మండల అధ్యక్షుడు సుబ్బుయాదవ్, పట్టణ అధ్యక్షుడు గోపీనాథరావు, నాయకులు శేషయ్య, రాయల్ మల్లి, రామభూపాల్, జొన్నగొర్ల రామకృష్ణ, శివకుమార్, మద్దిలేటి, వెంకటేష్, రాందాస్, రామక్రిష్ణ, రామమద్దయ్య, సుంకన్న, శ్రీను, మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.