ప్రజా వ్యతిరేక విధానాల వల్లే భారం
ABN , First Publish Date - 2021-08-02T05:52:39+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వల్లే ప్రజలపై ఆర్థిక భారాలు పడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాల రాష్ట్ర నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతల ఆగ్రహం
నెల్లూరులో పునర్వ్యవస్థీకరణ సదస్సు
నెల్లూరు(వైద్యం), ఆగస్టు 1 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వల్లే ప్రజలపై ఆర్థిక భారాలు పడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాల రాష్ట్ర నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నెల్లూరులోని ఇందిరాభవన్లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్రెడ్డి అధ్యక్షతన పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లా సదస్సు జరిగింది. పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాల రాష్ట్ర అధ్యక్షుడు కొరివి వినయ్కుమర్, శాంతకుమారి, నులకుర్తి వెంకటేశ్వరరావు, దాదా గాంధీ మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. కేంద్రం తీసుకువచ్చిన జీఎస్టీ వల్ల పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయన్నారు. బీజేపీ ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై అధిక భారాలు మోపుతోందని విమర్శించారు. 23 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్కు అప్పగించేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాలను నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. దేవకుమార్రెడ్డి మాట్లాడుతూ బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలు విచిత్రమైన పన్నులు వేస్తూ పేద, మధ్యతరగతి ప్రజలపై మరింత భారం మోపుతున్నాయని ఆరోపించారు. అనంతరం షేక్ ఖాజామస్తాన్ సహకారంతో పలువురు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో నేతలు లేళ్లపల్లి సురేష్బాబు, నియోజకవర్గాల ఇన్చార్జులు ఉడతా వెంకట్రావ్, షేక్ ఫయాజ్, పరిమళ వెంకటేశ్వర్లు, దుద్దకూరు రమేష్ తదితరులు పాల్గొన్నారు.