కరోనా బాధితులకు ఉచిత భోజనం...ప్రారంభించిన ఎంపీ రేవంత్
ABN , First Publish Date - 2021-05-15T19:30:04+05:30 IST
: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద కరోనా రోగులకు ప్రతీరోజు వెయ్యి మందికి ఉచిత భోజన కార్యక్రమాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్రెడ్డి శనివారం ప్రారంభించారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద కరోనా రోగులకు ప్రతీరోజు వెయ్యి మందికి ఉచిత భోజన కార్యక్రమాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రేవంత్ మాట్లాడుతూ... సోనియాగాంధీ, రాహుల్ ఆదేశాల మేరకు... ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. లాక్డౌన్ కారణంగా పేషంట్స్ కుటుంబ సభ్యులకు భోజనాలు దొరకడం లేదన్నారు. ఫస్ట్ వేవ్లో కూడా ప్రభుత్వాలు కనీస సౌకార్యాలు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. యూత్ కాంగ్రెస్ తరపున అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. యూత్ కాంగ్రెస్ వర్క్ చేస్తుంటే అరెస్ట్లు చేస్తున్నారని మండిపడ్డారు. విచారణ పేరిట అడ్డుకుంటున్నారన్నారు. గాంధీ ఆసుపత్రి కోవిడ్ హాస్పిటల్ అయినా... కనీస సౌకర్యాలు లేవని... ఎవరి దగ్గర డబ్బులు లేవని తెలిపారు. డాక్టర్, నర్సులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆహారం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ప్రతి రోజు 1000 మందికి ఆహారం ఏర్పాటు చేస్తున్నామన్నారు. లాక్డౌన్ ఉన్నంత వరకు భోజన వసతి కల్పిస్తామని చెప్పారు. 5 రూపాయలకే భోజన కార్యక్రమాన్ని కాంగ్రెస్ స్టార్ట్ చేసిందని...అయితే ఈ టైంలో కూడా ప్రభుత్వం భోజనం ఏర్పాటు చెయ్యలేదని ఎంపీ అన్నారు. డాక్టర్స్, నర్సులు, సిబ్బంది, పేషంట్స్, వారి బంధువులకు 1000 మందికి భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ రోజు, రేపు వ్యాక్సిన్ను నిలిపివేశారని.. సెకండ్ డోస్ అందించడానికి వ్యాక్సిన్ లేదని అన్నారు. వ్యాక్సిన్ లేక ఇలా డోసుల వ్యవధి పెంచుతున్నారని వ్యాఖ్యానించారు. టిమ్స్లో 8 వ ఫ్లోర్ తరువాత ఆక్సిజన్ అందడం లేదని తెలిపారు. బెడ్స్ కొరత, ఆక్సిజన్ , రెమెడిషివర్ కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. సిగ్గు లేకుండా వసూళ్ల కోసం ప్రగతి భవన్లో టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైన సమస్యలను చర్చించలేదన్నారు. ఒక గర్భిణీ వైద్యం అందక చనిపోయిందని... స్మశాన సిబ్బంది కూడా తల్లిని బిడ్డను వేరు చేస్తేనే దహనం అన్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్స్లో కనీస సౌకర్యాలు లేవని దుయ్యబట్టారు. టాస్క్ఫోర్స్లో వసూల్ టీం మాత్రమే ఉందని ఆరోపించారు. వైద్యులు ఎవరు లేరన్నారు. కార్పొరేట్ కంపెనీలను పిలిచి... దండుకోవడాని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అందరికి వ్యాక్సిన్ అందాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకుల మీద వేధింపులు ఆపాలన్నారు.
రెమెడిషివర్ బ్లాక్ మార్కెట్ అయ్యిందన్నారు. టీఆర్ఎస్ నాయకులు కంపెనీల దగ్గర స్టాక్ పెట్టుకుంటున్నారని... కావాల్సిన వారికి రెమెడిషివర్ ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు. కరోనాను ఆరోగ్య శ్రీలో ఎందుకు చేర్చడం లేదని ప్రశ్నించారు. కరోనా వల్ల తల్లి దండ్రులు చనిపోతే...చత్తీస్గఢ్లో పిల్లలకు రూ.5 వేలు ఇస్తున్నారని... ఇక్కడ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. యశోద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఇష్టారాజ్యంగా కోట్ల బిల్లులు వేస్తున్నారని.. మెడిసన్ వాడకుండా బిల్స్ వేస్తున్నారని ఎంపీ రేవంత్రెడ్డి ఆరోపించారు.