కాంగ్రెస్కు స్టార్ క్యాంపెయినర్ షాక్
ABN , First Publish Date - 2022-01-26T07:30:15+05:30 IST
శాసనసభ ఎన్నికల ముంగిట ఉత్తరప్రదేశ్లో రాజకీయ పరిణామాలు మరింత వేడుక్కుతున్నాయి. పార్టీల నుంచి జంపింగ్లు ముమ్మరమయ్యాయి. ఈ క్రమంలో కాంగ్రె్సకు పెద్ద షాక్ తగిలింది. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రతన్జిత్ ప్రతాప్ నరైన్సింగ్ (ఆర్పీఎన్ సింగ్) మంగళవారం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ..
కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ రాజీనామా
లఖ్నవూ, జనవరి 25: శాసనసభ ఎన్నికల ముంగిట ఉత్తరప్రదేశ్లో రాజకీయ పరిణామాలు మరింత వేడుక్కుతున్నాయి. పార్టీల నుంచి జంపింగ్లు ముమ్మరమయ్యాయి. ఈ క్రమంలో కాంగ్రె్సకు పెద్ద షాక్ తగిలింది. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రతన్జిత్ ప్రతాప్ నరైన్సింగ్ (ఆర్పీఎన్ సింగ్) మంగళవారం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. దీనికిముందు ట్విటర్లో కాంగ్రెస్ అనుబంధంగా ఉన్న తన బయోను మార్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో ఢిల్లీలో బీజేపీలో చేరారు. ఈ పరిణామం తూర్పు యూపీలో కాంగ్రె్సకు పెద్ద దెబ్బ అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు ఇదే ప్రాంతానికి చెందిన కీలక నేత, మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య ఇటీవలే బీజేపీని వీడి సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరారు. ఆ లోటును ఆర్పీఎన్ సింగ్తో భర్తీ చేసుకోవాలని కాషాయ పార్టీ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. వీరిద్దరూ ఓబీసీలే. కాగా, సోమవారం రాత్రి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక తదితరులతో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆర్పీఎన్ పేరుండడం గమనార్హం. మరుసటి రోజు ఉదయానికే ఆయన పార్టీకి ఝలక్ ఇచ్చారు. కాగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన మాజీ ఎంపీ ఆనంద్ గౌతమ్ కూడా కాంగ్రె్సకు రాజీనామా చేశారు. మరోవైపు ఆర్పీఎన్ నిష్క్రమణపై కాంగ్రెస్ స్పందిస్తూ, పిరికివారు బీజేపీతో పోరాడలేరంటూ వ్యాఖ్యానించింది.
బీజేపీ, ఎస్పీ.. దొందూ దొందే: ప్రియాంక
యూపీలో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా అన్నారు. మతం పేరుతో ఒక పార్టీ, కులం పేరుతో మరో పార్టీ రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.