యూపీలో అన్ని స్థానాలకూ కాంగ్రెస్ పోటీ : ప్రియాంక గాంధీ

ABN , First Publish Date - 2021-11-15T00:07:36+05:30 IST

రానున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో అన్ని

యూపీలో అన్ని స్థానాలకూ కాంగ్రెస్ పోటీ : ప్రియాంక గాంధీ

బులంద్‌షహర్ (ఉత్తర ప్రదేశ్) : రానున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో అన్ని (403) స్థానాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులను నిలుపుతామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీతో కానీ, బీఎస్‌పీతో కానీ ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకునే ఆలోచన లేదన్నారు. ఆదివారం జరిగిన ‘ప్రతిజ్ఞ సమ్మేళన్-లక్ష్య 2022’లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. 


ఈ సమావేశంలో 14 జిల్లాలకు చెందిన కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు. వీరిలో చాలా మంది  రానున్న శాసన సభ ఎన్నికల్లో పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలని, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవద్దని ప్రియాంక గాంధీని కోరారు. దీనిపై ఆమె స్పందిస్తూ, అన్ని స్థానాలకు కేవలం కాంగ్రెస్ కార్యకర్తలను మాత్రమే నామినేట్ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ గెలవవాలంటే, సొంతంగానే గెలుస్తుందన్నారు. 


ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తున్నందుకు కార్యకర్తలను అభినందించారు. జవహర్లాల్ నెహ్రూ తన పుస్తకంలో ‘భారత్ మాతా కీ జై’ అనే నినాదాన్ని రాశారని చెప్పారు. రైతులు, సైనికులు, కార్మికులు, మహిళలను గౌరవించాలనేదే దీని అర్థమని వివరించారు. స్వాతంత్ర్య సమర యోధులకు స్వాతంత్ర్యం ప్రాధాన్యం, విలువ తెలుసునన్నారు. రాజ్యాంగ స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్ర్యం, బలమైన ప్రజాస్వామ్యం ఉండటమే స్వాతంత్ర్యమని చెప్పారు. తాను ఉత్తర ప్రదేశ్‌కు వచ్చినపుడు బీజేపీకి స్వాతంత్ర్యం అంటే అర్థం తెలియదని తనకు తెలిసిందని చెప్పారు. 


ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేష్ బాఘెల్ ఇటీవల మాట్లాడుతూ, స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ సిద్దంగా ఉందని చెప్పారు. దీంతో పొత్తులపై ఊహాగానాలు ప్రచారమవుతున్నాయి. 


Updated Date - 2021-11-15T00:07:36+05:30 IST