అమెరికా ప్రతినిధుల సభలో అంబేద్కర్ గౌరవార్థం తీర్మానం!
ABN , First Publish Date - 2021-04-16T14:32:50+05:30 IST
భారత రాజ్యాంగ నిర్మాత, డా. బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా అమెరికా ప్రతినిధుల సభలో భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రోహ్ ఖన్నా తీర్మానం ప్రవేశపెట్టారు.
వాషింగ్టన్: భారత రాజ్యాంగ నిర్మాత, డా. బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా అమెరికా ప్రతినిధుల సభలో భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రోహ్ ఖన్నా తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రపంచ దేశాల్లోని యువనేతలు అంబేద్కర్ చూపిన సమానత్వ మార్గం ద్వారా స్ఫూర్తి పొందాలని ఈ సందర్భంగా ఖన్నా పేర్కొన్నారు. కాగా, అంబేద్కర్ గౌరవార్థం అమెరికా కాంగ్రెస్లో ఖన్నా వరుసగా రెండోసారి ఈ తీర్మానం ప్రవేశపెట్టడం విశేషం. ఈ సందర్భంగా ఖన్నా మాట్లాడుతూ.. "అంబేద్కర్ గౌరవార్థం ఆయన 130వ జయంతి సందర్భంగా ఇవాళ నేను మరోసారి తీర్మానం ప్రవేశపెడుతున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువనేతలు అంబేద్కర్ చూపించిన సమానత్వం మార్గం ద్వారా ప్రేరణ పొందుతారని ఆశిస్తున్నాను. దళితుడైన అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ద్వారా నేడు ఎంతో మంది భారతీయులు తమ హక్కులను కాపాడుకుంటున్నారు." అని అన్నారు. అలాగే వైశాఖి పండుగ విశిష్టతను గుర్తించాలంటూ జాన్ గారమేండి అనే కాంగ్రెస్ సభ్యుడు ప్రతినిధుల సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. చారిత్రాత్మక, సాంస్కృతిక, మతపరమైన ఈ పండుగ ప్రాముఖ్యతను గౌరవించాలని ఆయన తన తీర్మానంలో పేర్కొన్నారు. కాగా, జాన్ గారమేండి అమెరికా చట్టసభలో సిక్కు కమ్యూనిటీకి నేతృత్వం వహిస్తున్నారు.