నా పై దాడికి కుట్ర చేస్తున్నారేమో...?: ఈటల
ABN , First Publish Date - 2021-10-03T00:54:23+05:30 IST
‘నా మీద నేనే దాడి చేయించుకుంటున్నారని టీఆర్ఎస్ మంత్రులు అంటున్నారు. 13, 14 తేదీల్లో దాడి జరిగే అవకాశం ఉంది అని చెబుతున్నారు.
వీణవంక: ‘నా మీద నేనే దాడి చేయించుకుంటున్నారని టీఆర్ఎస్ మంత్రులు అంటున్నారు. 13, 14 తేదీల్లో దాడి జరిగే అవకాశం ఉంది అని చెబుతున్నారు. ఇదంతా చూస్తే నాపై దాడికి ఏమన్న కుట్ర చేస్తున్నారేమోనని అనుమానం కలుగుతోంది’ అని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలకు ఇద్దరు గన్మెన్ ఉంటారని, మాజీ మంత్రిని, ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న తనకు ఒక్కడే గన్మన్ ఉన్నాడని తెలిపారు.
అయినా బయటకు పోవడానికి భయపడే వ్యక్తిని కాదని, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలే తనకు అండగా ఉంటారని తెలిపారు. టీఆర్ఎస్ నేతల అండతో అధికారులు పిచ్చి పనులు చేస్తే వారి భరతం పడుతామని హెచ్చరించారు. టీఆర్ఎస్ నాయకులు హుజూరాబాద్ నియోజకవర్గంలో విషపూరితమైన చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా చక్కపెట్టుకున్నానని తెలిపారు. తనను పనికి రాకుండా చేద్దామని, ఆరోగ్య శాఖ ఇస్తే, అక్కడ కూడా నిరంతరం పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాని ఈటల రాజేందర్ తెలిపారు.