నిశ్చితార్థం రోజునే ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-01-11T02:19:41+05:30 IST
నిశ్చితార్థం కోసం ఉంగరాలు.. కొత్త దుస్తులు కొన్నారు. సోమవారం ఉదయం నిశ్చితార్థ వేడుక కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
ఖమ్మం: నిశ్చితార్థం కోసం ఉంగరాలు.. కొత్త దుస్తులు కొన్నారు. సోమవారం ఉదయం నిశ్చితార్థ వేడుక కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ అంతలోనే వారికొక చేదు వార్త వినిపించింది. నిశ్చితార్ధానికి రావాల్సిన ఆ యువకుడు ఖమ్మంలోని ఓ హోటల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసిందే. అంతే ఎంతో సందడిగా కనిపించిన ఆ పెళ్లింట విషాదం అలముకుంది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం యజ్ఞనారాయణ పురం గ్రామానికి చెందిన కంచెపోగు అశోక్కుమార్(27) 2020లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఆర్ కానిస్టేబుల్గా చేరాడు. ప్రస్తుతం ములుగు జిల్లాలోని స్పెషల్పార్టీలో అటాచ్మెంట్గా పనిచేస్తున్నాడు. అతనికి తన సొంత మండలమైన కల్లూరు మండలానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆ యువతి ఇంటివద్ద నిశ్చితార్థం చేసుకోవాలని నిర్ణయించిన పెద్దలు అన్ని ఏర్పాట్లుచేశారు.
అశోక్కుమార్ ఈనెల 5న ఖమ్మం వచ్చి తల్లిదండ్రులతో కలిసి నిశ్చితార్థానికి అవసరమైన దుస్తులు, ఉంగరాలు అన్నీ కొన్నారు. తాను ములుగు వెళ్లి సెలవు పర్మిషన్ తీసుకుని వస్తానంటూ ములుగు జిల్లాకు వెళ్లాడు. అక్కడ సెలవు పెట్టి 8వతేదీ రాత్రి ఖమ్మం వచ్చి స్థానిక ఓ హోటల్లో రూం తీసుకున్నాడు. ఆ తర్వాత సోమవారం ఉదయం హోటల్రూంలో గదికి తాళం పెట్టి ఉండడం, ఎంత కొట్టినా స్పందించకపోవడం, సెల్ఫోన్ కూడా స్విచ్ఛాప్ రావడంతో అనుమానం వచ్చిన లాడ్జి నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బంది వెళ్లి తలుపులు పగులగొట్టి చూడగా అశోక్కుమార్ ఉరేసుకుని కనిపించాడు. సెల్ఫోన్, ఇతర ఆధారాలు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో నిశ్చితార్థం కోసం వచ్చిన బంధువులు, కానిస్టేబుల్ కుటుంబసభ్యులంతా ఖమ్మం వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు. తన కుమారుడికి బదిలీ కావడంలేదన్న మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తండ్రి వెంకటేశ్వర్లు అనుమానం వ్యక్తం చేశాడు.