జూన్ 1న ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం
ABN , First Publish Date - 2021-05-06T08:38:41+05:30 IST
జగనన్న కాలనీల్లో జూన్ 1న ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభంకావాలని ముఖ్యమంత్రి జగన్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు
కర్ఫ్యూలోనూ పనులు ఆగకూడదు
ఇళ్ల నిర్మాణాలతో కూలీలకు పనులు
ఇసుక, సిమెంటు, ఐరన్ లావాదేవీలు
అదనపు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరదాం
పేదలందరికీ ఇళ్లపై సమీక్షలో సీఎం జగన్
అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): జగనన్న కాలనీల్లో జూన్ 1న ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభంకావాలని ముఖ్యమంత్రి జగన్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దీనికిగాను ఈ నెల 25లోపు ముం దస్తు ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు. కర్ఫ్యూ సమంలోనూ నిర్మాణ పనులు ఆగకూడదని, మధ్యాహ్నం 12 గంటల వరకు యథావిథిగా కార్యకలాపాలు కొనసాగాలని స్పష్టంచేశారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం బుధవారం సమీక్షించారు. కొవిడ్ సమయంలో ఇళ్ల నిర్మాణాలు ఆర్థిక వ్యవస్థకు వృద్ధికారకంగా ఉంటాయని, నిర్మాణాల్లో ఎక్కడా జాప్యం జరగకూడదని పేర్కొన్నారు. నిర్మాణాల వల్ల కార్మికులకు ఉపాధి దొరుకుతుందని, స్టీలు, సిమెంట్, ఇతర మెటీరియల్ కొనుగోలుతో వ్యాపార లావాదేవీలు కొనసాగుతాయని చెప్పారు. ప్రతి లేఅవుట్లో ఒక మోడల్ హౌస్ నిర్మించాలన్నారు. ఎక్కడైనా నిర్మాణ వ్యయం మించిపోయిందా? వ్యయాన్ని తగ్గించే అవకాశం ఉందా? వంటి అంశాలను పరిశీలించాలన్నారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో స్టీలు వినియోగం తగ్గుతుందుని, దానివల్ల ధరల్లో వ్యత్యాసం కనిపించే వీలుందని అంచనా వేశారు. ప్రభుత్వం నిర్మించే ఇళ్లకు అవసరమైన 7.5 లక్షల టన్నుల స్టీలు కోసం స్టీలు కంపెనీలతో ప్రత్యేకంగా మాట్లాడాలని సూచించారు. ఎవరైనా లబ్ధిదారులు సొంతంగా ఇళ్లు కట్టుకుంటామంటే కావాల్సిన నిర్మాణ మెటీరియల్ అందించాలన్నారు. లేవుట్లలో లెవెలింగ్ ముఖ్యమని, ఇంకా 1.95 లక్షల ప్లాట్లకు ఈ సమస్య ఉందని సీఎం చెప్పారు. నీటి పైపులైన్లు, విద్యుత్ కేబుళ్లు, ఇతర కేబుళ్లు అన్నీ పూర్తిగా భూగర్భ వ్యవస్థలో ఉండాలన్నారు.
కాలనీలకు కేంద్రాన్ని ఆశ్రయిద్దాం
ఈ స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నందున అదనపు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరదామని సీఎం జగన్ అన్నారు. టిడ్కో ఇళ్లకు ఎలాగూ వాటా ఇస్తోందని, కాలనీల్లోని ఇళ్లకు కూడా అదనపు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేద్దామని తెలిపారు. అనంతరం, రాష్ట్రంలోని ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులపై అధికారులు ప్రజెంటేషన్లు ఇచ్చారు.