ఆగిపోయిన భవనం పనులు
ABN , First Publish Date - 2021-05-08T05:30:00+05:30 IST
చాగలమర్రి గ్రామంలో ఉర్దూ పాఠశాల నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచి పోయాయి.
- కాంట్రాక్టర్కు అందని బిల్లులు
- ఇబ్బంది పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు
చాగలమర్రి, మే 8: చాగలమర్రి గ్రామంలో ఉర్దూ పాఠశాల నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచి పోయాయి. రూ.24 లక్షల మైనార్టీ నిధులతో భవన నిర్మాణ పనులను రెండేళ్ల క్రితం కాంట్రాక్టర్లు చేపట్టారు. ఇందులో రూ.23 లక్షల వరకు పనులు చేశామని, మరో రూ.5 లక్షలు బిల్లులు రావాల్సి ఉందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. భవన నిర్మాణ పనులు స్లాబ్ వరకు వేగంగా పూర్తి చేశారు. ప్రభుత్వం మారాక కాంట్రాక్టర్కు బిల్లులు ఆగిపోయాయి. దీంతో పనులు అర్ధాంతరంగా ఆపేశారు. పాఠశాల భవనం పూర్తి కాక పోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. 1 నుంచి 9వ తరగతి వరకు 80 మంది విద్యార్థులు ఒకే గదిలో కూర్చోవాల్సి వస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి భవన పనులు పూర్తి చేసి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఈ విషయం గురించి పాఠశాల హెచ్ఎం ఇసుల్లాఖాన్ను వివరణ కోరగా.. ఉర్దూ పాఠశాల భవనాలు నిలిచిన మాట వాస్తవమే అన్నారు. కాంట్రాక్టర్కు బిల్లు రాక పనులు చేయలేదని, ఈ విషయంపై జిల్లా అధికారులకు నివేదికలు పంపించామని తెలిపారు. మంజూరైన నిధుల వరకు పనులు చేశామని కాంట్రాక్టర్లు చెబుతున్నారని అన్నారు. పాత ధరల ప్రకారం అంచనా వేయడంతో మం జూరైన నిధులు సరిపోలేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారని అన్నారు. ఈ విషయం అధికారులకు తెలియజేశామన్నారు.