ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణ పనులు
ABN , First Publish Date - 2021-01-17T05:55:43+05:30 IST
ఎఫ్టీఎల్ పరిధిలో కొందరు వ్యక్తులు ప్రహరీ నిర్మాణ పనులను చేపడుతుండగా అడ్డుకునేందుకు వచ్చిన ఇరిగేషన్ ఏఈ సంతోషినితో వాగ్వాదానికి దిగారు.
అడ్డుకున్న అధికారితో వాగ్వాదం
రామచంద్రాపురం, జనవరి 16: ఎఫ్టీఎల్ పరిధిలో కొందరు వ్యక్తులు ప్రహరీ నిర్మాణ పనులను చేపడుతుండగా అడ్డుకునేందుకు వచ్చిన ఇరిగేషన్ ఏఈ సంతోషినితో వాగ్వాదానికి దిగారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ఈదులనాగుల పల్లి సర్వే నంబరు 110లో ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నాగులకుంట ఎఫ్టీఎల్ పరిధిలో కొందరు వ్యక్తులు ప్రహరీ నిర్మాణ పనులు చేపడుతున్నారంటూ స్థానికులు తహసీల్దార్ శివకుమార్, ఇరిగేషన్ అధికారులకు శనివారం సమాచారాన్ని అందించారు. ఏఈ వీఆర్ఏతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ఈ స్థలం ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందని, వెంటనే పనులను నిలిపివేయాలని సూచించారు. నిర్మాణదారులు రమేష్, రాజు హెచ్ఎండీఏ నక్షాను ఏఈకి చూపుతూ.. ఇక్కడ ఎఫ్టీఎల్ లేదు, మీరెలా ఎఫ్టీఎల్ అంటారని వాగ్వాదానికి దిగారు. ‘అసలు మీరు ఇరిగేషన్ అధికారి అని ఎవరికి తెలుసు’ అంటూ అధికారి మాటలను వీడియోలో చిత్రీకరించారు. చివరకు ఏఈ ఆదేశాలతో వారు పనులను నిలిపివేశారు.