60 ఏళ్లుగా వివాదం
ABN , First Publish Date - 2021-01-08T07:33:14+05:30 IST
హఫీజ్పేట్ సర్వే నంబర్-80...! దశాబ్దాలుగా వివాదాల సుడిగుండంలో.. కోర్టు కేసులతో.. హత్యలు-ప్రతి హత్యలతో దాదాపు డజను మందిని బలిగొన్న భూమి. తాజాగా బోయిన్పల్లిలో కటికనేని ప్రవీణ్కుమార్, అతని
హఫీజ్పేట్ సర్వే నం.80పై రగడ.. పాయ్గా వంశీయులకు నిజాం ఫర్మాన్
1929లో గెజిట్.. నిజాం నుంచి కొన్నట్లుగా కొన్ని సంస్థల క్లెయిమ్
సిటీ సివిల్కోర్టు మొదలు సుప్రీం దాకా కేసులు.. తేలని భూవివాదం
ధరణిలో 484.31 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని వెల్లడి
3 దశాబ్దాల్లో డజను హత్యలు.. తాజా కిడ్నాప్కు కారణం ఈభూములే
ఈ భూముల్ని చేజిక్కించుకున్న వారిలో అన్ని పార్టీల నేతలు
మియాపూర్, జనవరి7 (ఆంధ్రజ్యోతి): హఫీజ్పేట్ సర్వే నంబర్-80...! దశాబ్దాలుగా వివాదాల సుడిగుండంలో.. కోర్టు కేసులతో.. హత్యలు-ప్రతి హత్యలతో దాదాపు డజను మందిని బలిగొన్న భూమి. తాజాగా బోయిన్పల్లిలో కటికనేని ప్రవీణ్కుమార్, అతని సోదరుల కిడ్నాప్ వెనక.. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్టు వెనక.. వివాదాలకు ప్రధాన కారణమైన భూమి..! దశాబ్దాల క్రితం రూ. వేలల్లో విలువ ఉన్నప్పుడు ప్రారంభమై.. ఇప్పుడు ఆస్తి విలువ వేల కోట్లకు చేరుకున్నా.. ఓ కొలిక్కి రాని హఫీజ్పేట్ భూములపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..
ఏడో నిజాం ఫర్మాన్తో..
నిజాం రాష్ట్ర రైల్వే నిర్మాణ సమయంలో.. ఇబ్రహీంపట్నం, పటాన్చెరు ప్రాంతాల్లో ఖుర్షీద్ జాహీ పాయ్గా, చావూస్, నవాబ్ వంశీయులకు చెందిన భూములను నిజాం ప్రభుత్వం సేకరించింది. ఆ ఆస్తులకు ప్రత్యామ్నాయంగా.. హఫీజ్పేట్ సర్వేనంబర్-80, హైదర్నగర్లలో భూములను కేటాయిస్తూ.. 1929లో ఏడో నిజాం మీర్-ఉస్మాన్ అలీఖాన్ ఫర్మాన్ జారీ చేశారు. ప్రస్తుతం హఫీజ్పేట్ సర్వే నంబర్లో 484.31 ఎకరాల భూమి ఉన్నట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. జాగీర్దారీ వ్యవస్థ రద్దయ్యాక.. ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
దీనిపై 1958లో పాయ్గా వారసుల్లో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇంకొందరు తమ వాటా భూములను గ్రేటర్ గోల్కొండ వారసులకు అగ్రిమెంట్ చేశారు. ఆ సమయంలో.. నిజాం ప్రభువే ఈ భూమిని కొనుగోలు చేసినట్లు ఉన్న లింక్ డాక్యుమెంట్ను జత చేశారు. అయితే.. 1929లోనే ఫర్మాన్ అయ్యాక.. మళ్లీ నిజాం ఆ భూముల్ని ఎందుకు కొంటాడని మిగతా వారసులు ప్రశ్నించారు. అప్పటినుంచే.. ఈ భూమిపై సీఎస్-14/1958 కేసు న్యాయస్థానంలో మొదలైంది. 1968 జూన్ 28న హైకోర్టు ఈ భూములపై ప్రిలిమినరీ డిక్రీని ఇచ్చింది. ఆ తర్వాత.. ఇప్పటి వరకు ఎవరూ ఫైనల్ డిక్రీని పొందలేదు. అయితే.. ప్రిలిమినరీ డిక్రీ వచ్చాక.. హక్కుదారులెవరూ భూములను స్వాధీనం చేసుకోవడానికి ముందుకు రాలేదు. కొండలు, గుట్టలు, అడవి మాదిరిగా ఉన్న ఈ భూముల్లో అసైన్మెంట్ డీడ్ చేసుకునేందుకూ ఆసక్తి చూపలేదు. దాంతో.. ఆ సర్వే నంబర్-80లోని భూములన్నీ సర్కారువేనని ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. ఈ మేరకు పలు కోర్టుల్లో అఫిడవిట్లు దాఖలు చేసింది. ప్రభుత్వం ఇటీవల పరిచయం చేసిన ధరణి పోర్టల్లో కూడా.. ఈ భూములన్నీ సర్కారువేనని పేర్కొంటూ.. వాటిని నిషేధిత జాబితాలో పెట్టింది.
ఎవరికి వారు ప్లాట్లుగా చేసి..
పాత ముంబై జాతీయ రహదారి, కొత్త ముంబై జాతీయ రహదారికి మధ్య(గచ్చిబౌలి-మియాపూర్) ఈ ప్రాంతం వారధిగా ఉండడం.. పేద, మధ్యతరగతి ప్రజలు ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడం.. కొండాపూర్లో 8వ బెటాలియన్ ప్రత్యేక పోలీసు బెటాలియన్ ఏర్పాటవ్వడంతో.. పాయ్గా, చావూస్ వారసులు సర్వే నంబర్-80లోని భూముల్లో ఎవరికి వారుగా కాలనీలు, ప్లాట్లు ఏర్పాటు చేసి, విక్రయాలు సాగించారు. అలా 1983-84లో సుభాష్ చంద్రబోస్ నగర్ పేరుతో వెంచర్ను అభివృద్ధి చేసిన కబీరుద్దీన్ ఖాన్(కబీర్ నవాబ్) రూ. 15లకు గజం చొప్పున భూములను విక్రయించారు. అదే సమయంలో.. ప్రేమ్నగర్, మార్తాండనగర్ పేరుతో ఇస్మాయిల్, పాయ్గా కాలనీ పేరుతో పాయ్గా వారసులు, మరికొన్ని పేర్లతో చావూస్ వారసులు ప్లాట్లను విక్రయించారు. 30.31 ఎకరాలను ఓ 30 మంది వ్యక్తులు/సంస్థలు క్లెయిమ్ చేస్తూ రాగా.. 116 ఎకరాలను బి.శివరామకృష్ణ, సి.కల్యాణ్, మరో వ్యక్తి, ముంబైకి చెందిన సైరస్ ఇన్వె్స్టమెంట్స్ క్లెయిమ్ చేస్తూ వచ్చింది. కొన్ని భూములు చేతులు మారుతూ వచ్చాయి.
హైటెక్సిటీ రాకతో..
కొండాపూర్ ప్రాంతంలో 1990 తొలినాళ్లలో శిల్పారామం రావడం.. ఆ తర్వాత హైటెక్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన జరగడంతో ఇక్కడి భూములకు డిమాండ్ పెరిగింది. దీంతో.. కోర్టుల్లో వివాదాలకు పరిమితమైన ఈ భూమి.. హత్యలు-ప్రతి హత్యలకు వేదికగా మారింది. ఆ పార్టీ.. ఈ పార్టీ అని కాకుండా.. అధికార, ప్రతిపక్షాల నేతలు కబ్జాలకు పాల్పడ్డారు. 1989లో సాబేర్ చావూ్సను అతడి ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. సాబేర్ తండ్రి.. తన ప్రత్యర్థులపై బేగంబజార్లో బాంబుతో దాడి చేయించాడు. తుపాకీతో ఫైర్ చేయించారు. 1997లో రియల్టర్ హరిబాబు హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత మాదాపూర్లో అబూబకా్సను ప్రత్యర్థులు దారుణంగా చంపారు. ఇప్పుడు భూమా అఖిలప్రియ-ప్రవీణ్కుమార్ మధ్య వివాదంలో ఉన్న భూమిలో.. శేఖర్నాయుడు అనే రియల్టర్ను ప్రభాకర్రాయుడు అనే వ్యక్తి 2005లో హత్య చేయించాడు. ఆ తర్వాత ప్రభాకర్ రాయుడు పంజాగుట్టలో హత్యకు గురయ్యాడు. తాజాగా ప్రవీణ్కుమార్, అతడి సోదరుల కిడ్నా్పకు ఈ భూములే ప్రధాన కారణమయ్యాయి. గత ఏడాది ఏవీ సుబ్బారెడ్డిపై ప్రవీణ్ మేనేజరు మియాపూర్ పోలీ్సస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇలా మ్యుటేషన్లు చేయించుకున్నారు?
కొందరు రియల్టర్లల ఈ భూములను క్లెయిమ్ చేసుకోవడానికి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు. తప్పుడు కేసులతో.. సెటిల్మెంట్ డిక్రీలు పొంది.. వాటి ఆధారంగా మ్యుటేషన్లు చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు.. ‘ఏ’ అనే వ్యక్తి పాయ్గా వారసుడు. ప్రస్తుతం అతను విదేశాల్లో ఉంటున్నాడు. అతనికి చెందిన భూములను గుర్తించిన ‘బీ’.. అది తనదేనంటూ నకిలీ పత్రాలు సృష్టిస్తాడు. దాన్ని చట్టబద్ధం చేసేందుకు.. తన అనుచరుడైన ‘సీ’ అనే వ్యక్తితో కోర్టులో తనకు వ్యతిరేకంగా పిటిషన్ వేయిస్తాడు. కొంత కాలం వివాదం కొనసాగాక.. తనదే పొరపాటని ‘సీ’ కోర్టుకు విన్నవిస్తాడు. ఆ మేరకు ‘బీ’కి కాంప్రమైస్ డిక్రీ వచ్చేలా చేస్తాడు. ఆ డిక్రీ ఆధారంగా ‘బీ’ రెవెన్యూ కార్యాలయంలో మ్యుటేషన్ చేయించుకుంటాడు. మ్యుటేషన్ ఆధారంగా బిల్డింగ్ అనుమతులు తీసుకుంటాడు. ఇతరులకు విక్రయిస్తాడు. సర్వే నంబర్-80లో చాలా వరకు జరిగిందిదే అని స్థానికులు చెబుతున్నారు.
పేదల కోసం..!
- శేరిలింగంపల్లిలో ఇళ్ల పట్టాల కోసం ఏళ్ల తరబడి పోరాటాలు చేసిన పేద ప్రజలు చాలా వరకు హఫీజ్పేట్ సర్వే నంబరు 80లో ఇళ్లు కట్టుకున్నారు. వారిలో కొందరు పాయ్గా వారసుల నుంచి స్థలాలను కొనుగోలు చేయగా.. మరికొందరు కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ఆవాసాలను ఏర్పాటు చేసుకున్నారు.
- 1990-2000 సంవత్సరాల మధ్య అప్పటి సీపీఐ నేతలు రక్తపు నాగేశ్గౌడ్, అజీజ్పాషా, సీపీఎం నాయకుడు తాండ్రకుమార్ వంటి వారు ఈ భూముల్లో పేదలకు పట్టాలు ఇవ్వాలని పోరాటాలు చేశారు.
- సీపీఐ సీనియర్ నేత నారాయణ కూడా ఈ భూముల్లో పేదలకు పట్టాలు ఇవ్వాలంటూ 2008లో మూడు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. అప్పటి హోంమంత్రి సబితారెడ్డి ‘‘ఈ భూములను పరిశీలించి.. ప్రభుత్వానిదే అని తేలితే.. పేదలకు పట్టాలు ఇప్పిస్తా’’ అని హామీ ఇచ్చారు. ఆయనకు నిమ్మరసం ఇచ్చి, దీక్షను విరమింపజేశారు.