శ్మశాన వాటికపై వివాదం!
ABN , First Publish Date - 2021-01-21T06:03:27+05:30 IST
హరిపాలెం, అందలాపల్లి గ్రామాల మధ్య శ్మశాన వాటిక విషయమై బుధవారం మరోమారు వివాదం ఏర్పడింది.
అందలాపల్లిలో మృతిచెందిన వృద్ధురాలు
శ్మశాన వాటికకు తీసుకు వెళుతుండగా అడ్డుకున్న హరిపాలెం వాసులు
ఎమ్మెల్యే చొరవతో తాత్కాలిక పరిష్కారం
అచ్యుతాపురం రూరల్, జనవరి 20 : హరిపాలెం, అందలాపల్లి గ్రామాల మధ్య శ్మశాన వాటిక విషయమై బుధవారం మరోమారు వివాదం ఏర్పడింది. మృతదేహంతో అందలాపల్లి గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించారు. కొండకర్ల పంచాయతీ పరిధిలో గల అందలాపల్లి రెండుగా చీలి ఉంటుంది. ఒక ప్రాంతం కొండకర్లకు ఆనుకుని, మరో ప్రాంతం హరిపాలెం గ్రామాన్ని ఆనుకుని ఉంటుంది. ఈ రెండు గ్రామాల పరిధిపై వివాదం నలుగుతోంది. తాజాగా శ్మశానం స్థలం విషయంలో మరోమారు భేదాభిప్రాయాలు బయటపడ్డాయి. బుధవారం అందలాపల్లి గ్రామానికి చెందిన జన చిన్న అనే వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందింది. మృతదేహాన్ని రెండు గ్రామాలు ఉపయోగించుకునే శ్మశాన వాటికకు తీసుకుని రావడానికి సిద్ధమయ్యారు. హరిపాలేనికి చెందిన శ్మశానంలో కొండకర్ల, అందలాపల్లి గ్రామస్థులు మృతదేహాలను దహనం చేయడానికి వీలులేదంటూ శ్మశానవాటికకు గేట్లు వేసి, తాళం బిగించారు. దీంతో హరిపాలెంలోని మెయిన్ రోడ్డుపై మృతదేహంతో అందలాపల్లి గ్రామస్థులు ఆందోళన చేశారు. వాహనాలు వెళ్లకుండా రాస్తారోకో నిర్వహించడంతో ఎస్ఐ లక్ష్మణరావు పరిస్థితిని చక్కదిద్దేందుకు విఫలయత్నం చేశారు. ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తిరాజు హరిపాలెం గ్రామ నాయకులతో ఫోన్లో మాట్లాడారు. సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో శ్మశానంలో దహనానికి అంగీకరించారు. ఇదిలావుంటే, ఇదే పంచాయతీ పరిధి కొండకర్ల అందలాపల్లిలో పది రోజుల క్రితం శ్మశానం విషయమై వివాదం తలెత్తడం విశేషం.