కూలి డబ్బులు రావడం లేదు

ABN , First Publish Date - 2021-07-24T05:30:00+05:30 IST

కేటీఆర్‌ బర్త్‌డేను ఘనంగా జరిపిన నాయకులు, ప్రజాప్రతినిధులకు ఉపాధి కూలీలు షాకిచ్చారు. కేక్‌ను కట్‌చేసి పక్కకు జరగ్గానే నెలల తరబడి కూలి డబ్బులు రావడం లేదని, ఇట్లా అయితే ఎలా బతికేదని ఎంపీడీవోను ప్రశ్నించారు. ఈ సంఘటన మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం రాంగాయపల్లిలో శనివారం చోటు చేసుకున్నది.

కూలి డబ్బులు రావడం లేదు
రంగాయపల్లిలో కేటీఆర్‌ బర్త్‌డేలో ఎంపీడీవోను ప్రశ్నిస్తున్న ఉపాధి కూలీలు

కేటీఆర్‌ బర్త్‌డేలో  ప్రజాప్రతినిధులను నిలదీసిన మహిళలు   

ఆగస్టులో చెల్లిస్తాం : ఎంపీడీవో 


తూప్రాన్‌ (మనోహరాబాద్‌), జూలై 24 : కేటీఆర్‌ బర్త్‌డేను ఘనంగా జరిపిన నాయకులు, ప్రజాప్రతినిధులకు ఉపాధి కూలీలు షాకిచ్చారు. కేక్‌ను కట్‌చేసి పక్కకు జరగ్గానే నెలల తరబడి కూలి డబ్బులు రావడం లేదని, ఇట్లా అయితే ఎలా బతికేదని ఎంపీడీవోను ప్రశ్నించారు. ఈ సంఘటన మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం రాంగాయపల్లిలో శనివారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని రంగాయపల్లిలో కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా కేక్‌ కట్‌ చేసే కార్యక్రమం చేపట్టారు. అనంతరం పల్లె ప్రకృతివనంలో మొక్కలు నాటుతుండగా, మహిళలు ఉపాధి కూలి డబ్బులు రావడం లేదంటూ ఎంపీడీవోను ప్రశ్నించారు. మూడునెలలుగా డబ్బులు రాకపోవడంతో ఇబ్బందుల పాలవుతున్నట్లు వాపోయారు. పోస్టుమాస్టర్‌ చనిపోవడంతో చెల్లింపులు జరగలేదంటూ చెప్పేందుకు ప్రయత్నించగా, అంతకంటే ముందు నుంచే డబ్బులు రావడం లేదంటూ పేర్కొన్నారు. కూలి డబ్బులు ఇప్పించేందుకు ఎవరూ ప్రయత్నం చేయడం లేదంటూ వాపోయారు. పింఛన్‌ డబ్బులు కూడా మనోహరాబాద్‌కు వెళ్లి తీసుకోవాల్సి వస్తున్నదని, దానికి రూ.200 ఖర్చు అవుతున్నదని చెప్పారు. ఇంతలో అక్కడే ఉన్న కొందరు రాజకీయ నాయకులు సర్దిచెప్పి, ఎంపీడీవో జైపాల్‌రెడ్డిని అక్కడికి పిలిచారు. ఉపాధి కూలీల డబ్బులు ఆగస్టు మొదటి వారంలో చెల్లిస్తామని ఎంపీడీవో చెప్పడంతో మహిళా కూలీలు శాంతించారు. పోస్టాఫీసు సమస్యలు కూడా తీర్చాలంటూ కూలీలు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు. 

Updated Date - 2021-07-24T05:30:00+05:30 IST