జంట పట్టణాల్లో మళ్లీ అలజడి!
ABN , First Publish Date - 2020-07-10T10:17:25+05:30 IST
జంట పట్టణాల్లో మళ్లీ ‘కరోనా’ అలజడి రేగింది. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో మరో కొవిడ్ మరణం నమోదైంది.
కరోనా లక్షణాలతో మరో వృద్ధుడి మృతి
అధికారుల ఆధ్వర్యంలోనే అంత్యక్రియలు
(పలాస, జూలై 9) :జంట పట్టణాల్లో మళ్లీ ‘కరోనా’ అలజడి రేగింది. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో మరో కొవిడ్ మరణం నమోదైంది. పలాస ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు బుధవారం రాత్రి మృతి చెందాడు. అధికారులు, వైద్య సిబ్బంది వెంటనే స్పందించి.. వృద్ధుడి మృతదేహం నుంచి శ్వాబ్ సేకరించారు. దానిని ట్రూనాట్ పరీక్షల కోసం టెక్కలిలోని ఆసుపత్రికి పంపించగా, కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో గురువారం ఉదయం అధికారులే ప్రత్యేక వాహనాన్ని రప్పించారు. సిబ్బందికి పీపీఈ కిట్లు అందజేసి.. దగ్గరుండి ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
వృద్ధుడు ఏడాదిగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. కొద్దిరోజుల కిందట అదేప్రాంతానికి చెందిన ఒక వృద్ధుడు కరోనా లక్షణాలతో మృతి చెందాడు. ఆయన నుంచి ఈ వృద్ధుడికి కరోనా వ్యాప్తి చెందినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ ప్రకటించారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ఇన్చార్జి కమిషనర్ ఎన్.రమేష్నాయుడు, తహసీల్దార్ మధుసూధనరావు, సీఐ వేణుగోపాలరావు, మునిసిపల్ పారిశుధ్య సిబ్బంది సంయుక్తంగా నిర్వహించారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అధికారులంతా అక్కడే ఉన్నారు.
నాడు అలా.. నేడు ఇలా...
పలాసలో 13 రోజుల కిందట ఓ వృద్ధుడు మృతిచెందగా... అధికారులు ఎక్స్కవేటర్లో మృతదేహాన్ని తీసుకెళ్లి దహనం చేసిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం అదే ప్రాంతంలో మరో వృద్ధుడు మృతిచెందాడు. ఈ వృద్ధుడు కుటుంబ సభ్యులు కూడా చెంతనే ఉన్నా.. ఎవరూ దగ్గరికి రాలేదు. వృద్ధుడి భార్య, కుమార్తెలు స్థానికంగా ఉండగా... కుమారుడు విదేశాల్లో ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ ఎవరూ మృతదేహం దగ్గరికి రాకపోవడంతో అధికారులు, సిబ్బందే అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి కుటంబ సభ్యుల నుంచి సహకారం లేకపోయినా.. అధికారులే అంతా తామై అంత్యక్రియలు నిర్వహించడం ప్రశంసలు అందుకుంటోంది. అయితే, మృతుల కుటుంబ సభ్యులు సహకరించకపోతే తాము అంత్యక్రియలు నిర్వహించడం కష్టమేనని స్థానిక అధికారులు కలెక్టర్ నివాస్ ముందు ఏకరువు పెట్టారు.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయండి : కలెక్టర్ నివాస్
కరోనాతో వృద్ధుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న కలెక్టర్ నివాస్.. జంట పట్టణాల్లోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో గురువారం పర్యటించారు. లాక్డౌన్ నేపథ్యంలో జంట పట్టణాల్లో తీసుకుంటున్న చర్యలపై ఆర్డీవోను అడిగి తెలుసుకున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇంకా రహదారులపై షాపులు తెరుస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఉన్న కంట్రోల్ పాయింట్లలో ఉండాలని, సచివాలయ ఉద్యోగుల సేవలు కూడా వినియోగించుకోవాలని సూచించారు. సాధ్యమైనంత వరకు ఎక్కువగా ట్రూనాట్ పరీక్షలు చేసి కరోనా నివారణ చర్యలు చేపట్టాలన్నారు.
ప్రజలకు నిత్యావసర సరకులు, కూరగాయలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధులు నిర్వహిస్తున్న ఆశ కార్యకర్తలకు భోజన సౌకర్యంపై అధికారులు, కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మునిసిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ప్రజలు అనవసరంగా వీధుల్లో తిరగరాదని సూచించారు. భౌతిక దూరాన్ని పాటించాలని... మాస్క్లు ధరించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో లీలారాణి, టెక్కలి ఆర్డీవో కిషోర్, తహసీల్దార్ మధుసూధనరావు ఉన్నారు.