కరోనాను నియంత్రించడంలో చేతులెత్తేసిన జగన్‌

ABN , First Publish Date - 2020-08-04T11:11:44+05:30 IST

ఇవాళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తారస్థాయికి చేరుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సరిగా స్పందించకపోవడమే

కరోనాను నియంత్రించడంలో చేతులెత్తేసిన జగన్‌

మృతి చెందిన పాత్రికేయుల కుటుంబాలను ఆదుకోవాలి

రేపు సాకారం కానున్న హిందువుల కల

విశ్వాసం కలిగేలా అధికారికంగా రాష్ట్రంలో ఉత్సవాలు నిర్వహించాలి

అమరావతి కేంద్రంగా రాజధాని ఉండాలి

బీజేవైయం రాష్ట్ర అధ్యక్షుడు నాగోతు రమేష్‌నాయుడు


కడప (మారుతీనగర్‌), ఆగ స్టు 3 : ఇవాళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తారస్థాయికి చేరుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సరిగా స్పందించకపోవడమే కారణమని, కరోనా విజృంభిస్తున్నప్పటికీ ప్రజల ప్రాణాలు కాపాడడంలో సీఎం చేతులెత్తేశారని భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నాగోతు రమే్‌షనాయుడు ఆరోపించారు. స్వర్గీయ పైడికొండల మాణిక్యాలరావుకు సోమవారం కడప ప్రెస్‌క్లబ్‌లో నివాళి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నాగోతు రమేష్‌నాయుడు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.


కరోనా సమయంలో మీడియాప్రతినిధులు ప్రజలను జాగృతం చేసేలా పనిచేస్తున్నారని, ఆ క్రమంలో కడపకు చెందిన ముగ్గురు పాత్రికేయులు మృతిచెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కరోనాను నియంత్రించేందుకు వీలుగా తగిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు. ముఖ్యంగా కరోనా బారిన పడిన కొంతమంది వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు రాష్ట్ర వైద్యుల పట్ల విశ్వాసం లేక అటు తెలంగాణ, ఇటు చెన్నై, అటు కర్ణాటక ప్రాంతాలకు వెళ్లి వైద్యసేవలు పొందుతున్న తీరే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కరోనా బారిన పడిన వారికి మెరుగైన సేవలందించాలన్నారు. కాగా హిందువుల చిరకాల వాంఛ అయినటువంటి అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమిపూజ ఈ నెల 5న జరుగనుందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, వాడవాడల్లో ఉన్న రామాలయాల్లో ఉత్సవాలు నిర్వహించాలన్నారు.


అప్పుడే జగన్‌ ప్రభుత్వం పట్ల హిందువులకు విశ్వాసం కలుగుతుందన్నారు. అమరావతి కేంద్రంగా రాజధాని ఉండాలని, భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతోందన్నారు. కర్నూలులో హైకోర్టు, అమరావతిలో రాజధాని ఉండాలని గతంలోనే బీజేపీ నాయకులు ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు. ఇప్పటికే సీమ ప్రజలు రాజధాని విషయంలో మూడుసార్లు దగా పడ్డారని, ఇవాళ పాలన సాగిస్తున్న జగన్‌ మరోసారి రాష్ట్ర ప్రజలను దగా చేస్తూ విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పడం సరైంది కాదన్నారు. మాట తప్పడం, మడమ తిప్పడం మా వంశంలో లేదని గొప్పలు చెప్పే సీఎం ఇవాళ రాజధాని విషయంలో మాట, మడమ రెండూ తిప్పారన్నారు. ఇప్పటికైనా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టకుండా భవిష్యత్‌ తరాలను ఇబ్బందుల పాలు చేయకుండా పాలన సాగిస్తే మంచిగా ఉంటుందన్నారు. లేదంటే ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కేవీ చలమారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెసల సాంబశివారెడ్డి, నాయకులు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-04T11:11:44+05:30 IST