కరోనా బారిన మరో నలుగురు.. ఖమ్మం జిల్లాలో ఇద్దరు, భద్రాద్రిలో ఇద్దరికి పాజిటివ్
ABN , First Publish Date - 2020-07-08T22:04:38+05:30 IST
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో ఇద్దరు, భద్రాద్రి జిల్లాలో ఇద్దరు ఈ వైరస్ బారిన పడ్డారు. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన
ఖమ్మం సంక్షేమవిభాగం/కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో ఇద్దరు, భద్రాద్రి జిల్లాలో ఇద్దరు ఈ వైరస్ బారిన పడ్డారు. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన 58ఏళ్ల వ్యక్తి వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లగా అక్కడ కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించటంతో పాజిటివ్ రిపోర్టు వచ్చింది. అలాగే ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో సెక్యూరిటీగా ఉద్యోగం చేస్తున్న ఖమ్మంనగరంలోని ముస్తాఫానగర్కు చెందిన మహిళకు పాజిటివ్ నమోదైనట్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని శేషగిరినగర్కు చెందిన ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు కలెక్టర్ ఎంవీ.రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఇల్లెందు పట్టణంలోనూ ఒకరికి పాజిటివ్ రిపోర్టు రావడంతో రెండు పట్టణాల్లో కరోనా సోకిన ప్రాంతాల్లో మునిసిపల్, రెవెన్యూ, వైద్య అధికారులు, సిబ్బంది పారిశుధ్య చర్యలు చేపట్టి ఆయా ప్రాంతాలను కట్టడి చేశారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 130 కాగా.. 51మంది కోలుకున్నారు. మరో 71మంది చికిత్సపొందుతుండగా 8మృతిచెందారు. భద్రాద్రి జిల్లాలో జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 61పాజిటివ్ కేసులు వచ్చాయి. వీరిలో 11మంది డిశ్చార్జ్ కాగా ఒకరు మృతి చెందారు. 26మంది హోం క్వారంటైన్లో.. 23మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.