కరోనా నుంచి మంగళగిరిని రక్షించండి: నారా లోకేశ్

ABN , First Publish Date - 2020-08-14T13:33:44+05:30 IST

కరోనా కోరల్లో చిక్కుకున్న మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి..

కరోనా నుంచి మంగళగిరిని రక్షించండి: నారా లోకేశ్

లేఖలో కలెక్టరుకు నారా లోకేశ్ విజ్ఞప్తి


మంగళగిరి(గుంటూరు): కరోనా కోరల్లో చిక్కుకున్న మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలను కొవిడ్-19 బారి నుంచి కాపాడాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కలెక్టరుకు గురువారం లేఖ రాశారు. కరోనా బారిన పడి వైరస్‌ను ధైర్యంగా ఎదుర్కొని విధులకు హాజరవుతున్న కలెక్టరు ఫ్రంట్‌లైన్ వారియర్స్‌తో స్ఫూర్తిని నింపారని, సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకుని కొవిడ్ కట్టడికి చేస్తున్న కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. కొవిడ్ కేంద్రాలలో రోగుల భోజనం కోసం ప్రభుత్వం రూ.500 వెచ్చిస్తున్నా మంగళగిరి నియోజకవర్గంలో మాత్రం మెరుగైన భోజనం, వసతి అందడంలేదన్నారు.


దీనివల్ల వైరస్ నుంచి కోలుకునే వారి రికవరీ రేటు చాలా తక్కువగా ఉందన్నారు. కరోనా నుంచి కోలుకున్న రోగులకు ప్రభుత్వం అందించే రూ.2వేల సాయం ఏ ఒక్క రోగికీ ఇంతవరకు అందలేదన్నారు. పాజిటివ్ బాధితులను కొవిడ్ కేంద్రాలకు తరలించేందుకు రూ.300 చొప్పున వెచ్చిస్తున్నారని, అయితే మంగళగిరిలో మాత్రం సొంతంగా వాహనాలు సమకూర్చుకోవాల్సి వస్తుందన్నారు. సాఫారసులతో వచ్చిన వారినే ఆస్పత్రులు, క్వారంటైన్, కొవిడ్ కేంద్రాల్లో చేర్చుకుంటుండడంతో నిరుపేదలకు అడ్మిషన్లు దొరకడం లేదన్నారు. వలంటీర్ల వల్లే కొవిడ్‌ను కట్టడి చేయగలిగామని ప్రభుత్వం గొప్పలు చెబుతుందని, మంగళగిరిలో బాధితులను గుర్తించడంలో వలంటీర్లు విఫలం అవుతున్నారన్నారు. అందువల్లే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందన్నారు. కరోనాపై పోరాడుతున్న పారిశుధ్య కార్మికులకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకపోతే వారు పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు.


ప్రభుత్వం చెప్పినట్లుగా క్షేత్రస్థాయిలో మూడు మాస్కులు సక్రమంగా అందలేదన్నారు. నిత్యావసరాలు, సరైన వైద్యం అందక హోమ్ క్వారంటైన్‌లో ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి కనిపించడంలేదని విమర్శించారు. మంగళగిరిలోని కంటైన్మెంట్ జోన్లలో పారిశుధ్యం అధ్వానంగా తయారైందని తెలిపారు. ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించి, పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టరును లోకేశ్ కోరారు.

Updated Date - 2020-08-14T13:33:44+05:30 IST