కొద్దిరోజుల్లో కుమార్తె పెళ్లి.. వస్తువుల కోసం హైదరాబాద్కు వెళ్లొచ్చిన తండ్రికి కరోనా..
ABN , First Publish Date - 2020-07-23T16:49:14+05:30 IST
మెదక్ జిల్లాలో బుధవారం ముగ్గురికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇద్దరు మృతి చెందారు. రామాయంపేట మండలంలోని డి.ఽధర్మారంలో మహిళ(22)కు కరోనా సోకింది. గ్రామానికి చెందిన మహిళకు
మెదక్ జిల్లాలో ముగ్గురికి కరోనా పాజిటివ్.. కొవిడ్తో ఇద్దరి మృతి
రామాయంపేట/మెదక్(ఆంధ్రజ్యోతి): మెదక్ జిల్లాలో బుధవారం ముగ్గురికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇద్దరు మృతి చెందారు. రామాయంపేట మండలంలోని డి.ఽధర్మారంలో మహిళ(22)కు కరోనా సోకింది. గ్రామానికి చెందిన మహిళకు నాలుగు రోజుల క్రితం దగ్గు, జ్వరం రాగా స్థానిక ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకుంది. అయినప్పటికీ తగ్గకపోవడంతో భర్తతో కలిసి ఆమె స్వగ్రామమైన జగిత్యాలకు వెళ్లింది. అక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా బుధవారం కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో సమాచారం అందుకున్న ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది ఆమె ఉంటున్న ఇంటి పరిసరాలలో రెండు కుటుంబాలను, ఆర్ఎంపీని హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. కాగా గ్రామంలో గురువారం నుంచి స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు మూసి వేయాలని నిర్ణయించారు.
సీడ్స్ కంపెనీ వ్యాపారికి పాజిటివ్
రామాయంపేట పట్టణానికి చెందిన ఓ సీడ్స్ వ్యాపారి(45)కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. రెండు రోజుల క్రితం వ్యాపారికి జ్వరం, దగ్గు రావడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి వైద్యపరీక్షల నిమిత్తం వెళ్లాడు. అక్కడ కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. దీంతో వెంటనే ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. ఆగస్టు 9న వ్యాపారి కుమార్తె వివాహం జరుగనుండగా, పెళ్లి వస్తువుల కొనుగోలుకు పలుమార్లు అతడు హైదరాబాద్ వెళ్లి వచ్చాడు. దీంతోనే వైరస్ సోకి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
నర్సాపూర్కు చెందిన ఒకరికి కరోనా
నర్సాపూర్ పట్టణానికి చెందిన రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగి(59)కి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి విజయ్కుమార్ తెలిపారు. రెండు రోజుల క్రితం అస్వస్తతకు గురికాగా హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా అతడికి కరోనా పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.
కొవిడ్తో మాజీ సర్పంచ్ మృతి
చేగుంట మండలంలోని ఓ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్(63) కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన గుండె సంబంధిత వ్యాధితో హైదరాబాద్లోని ఓ పైవ్రేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో సదరు ఆసుపత్రి సిబ్బంది పరీక్షలు నిర్వహించగా కొవిడ్ - 19 పాజిటివ్ తేలడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు.
కరోనాతో బట్టలవ్యాపారి మృతి
మెదక్ పట్టణానికి చెందిన ఓ బట్టల వ్యాపారి కరోనాతో మృతి చెందాడు. ఈనెల 18న ఆయనకు కరోనా నిర్ధారణ కావడంతో హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాలుగు రోజులుగా అక్కడే చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించాడు.
హోం క్వారంటైన్లో ఉన్న ఏడుగురికి నెగటివ్
వెల్దుర్తి మండలంలోని మాసాయిపేటలో పది రోజుల క్రితం కరోనాతో ఓ యువకుడు మృతి చెందగా, అతడిని కలిసిన ఏడుగురు యువకులను ఆ రోజు నుంచి హోం క్వారంటైన్లో ఉంచారు. వారికి బుధవారం వెల్దుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా టెస్టులు నిర్వహించగా, అందరికీ నెగటివ్ వచ్చిందని ప్రాథమిక వైద్యాధికారి బాపురెడ్డి, హెల్త్ పైమ్రరీ ఇన్చార్జి ప్రదీప్ తెలిపారు.
25 మందికి హోం క్వారంటైన్
అల్లాదుర్గం మండలంలోని బహిరన్దిబ్బ, అప్పాజీపల్లిలో ఇద్దరు మహిళలకు కరోనా సోకడంతో బుధవారం ఆయా గ్రామాలను ఎస్ఐ మోహన్రెడ్డి, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి దివ్యజ్యోతి సందర్శించారు. బహిరన్దిబ్బలో 13 మందిని, అప్పాజీపల్లిలో 12 మందిని హోంక్వారంటైన్లో ఉంచారు. అనంతరం గ్రామంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. వైద్య సిబ్బంది వెంట సర్పంచులు స్వరూప, లక్ష్మమ్మ, ఉప సర్పంచ్ నర్సప్ప, ప్రభు, శ్రీనివాస్ ఉన్నారు.