విశాఖపట్నం జిల్లాలో 45,000వేలు దాటిన కరోనా కేసులు..
ABN , First Publish Date - 2020-09-16T15:55:00+05:30 IST
జిల్లాలో కరోనా కేసులు 45 వేలు దాటాయి. మంగళవారం మరో 474 మందికి..
మరో 474 మందికి కరోనా పాజిటివ్
జిల్లాలో 45,424కు చేరిన కేసులు
కోలుకున్న 39,829 మంది
ఆస్పత్రులు, కొవిడ్ కేర్ సెంటర్లలో 5,258 మంది
చికిత్స పొందుదూ మరో ఐదుగురి మృతి
337కు చేరిన మరణాలు
విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసులు 45 వేలు దాటాయి. మంగళవారం మరో 474 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో మొత్తం కేసులు 45,424కు చేరాయి. వీరిలో 39,829 మంది కోలుకోగా, మరో 5,828 మంది ఆస్పత్రులు, కొవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. కాగా, చికిత్స పొందుతూ మంగళవారం ఐదుగురు చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. వీటితో మొత్తం మృతుల సంఖ్య 337కు చేరింది.
ఆరిలోవలో 9..: ఆరిలోవ రిఫరల్ ఆస్పత్రిలో 139 మందికి పరీక్షలు నిర్వహించగా తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చింది.
కూర్మన్నపాలెంలో 9..: కణితి పీహెచ్సీ పరిధిలోని 86, 87 వార్డులకు చెందిన ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చింది.
మన్యంలో 24: ఏజెన్సీలో మంగళవారం 106 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 24 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని ఏడీఎంహెచ్వో డాక్టర్ కె.లీలాప్రసాద్ తెలిపారు. కొయ్యూరు మండలంలో ఆరు, జి.మాడుగులలో నాలుగు, చింతపల్లి, అరకులోయ, అనంతగిరిల్లో మూడేసి చొప్పున, డుంబ్రిగుడలో రెండు, పెదబయలు, పాడేరు, జీకే వీధిలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయన్నారు.
కోటవురట్లలో 8...: స్థానిక జూనియర్ కళాశాల వద్ద మంగళవారం 60 మందికి కరోనా పరీక్షలు చేయగా వీరిలో ఎనిమిది మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు కె.వెంకటాపురం పీహెచ్సీ వైద్యుడు శ్రీనివాసరాజు తెలిపారు. కరోనాతో ఆదివారం రాత్రి మృతిచెందిన రాట్నాలపాలెం ఆటోడ్రైవర్ కుటుంబసభ్యుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులకు పాజిటివ్ వచ్చింది. ఇంకా కోటవురట్లలో ఏఎన్ఎం, మరో మహిళ, పాత గొట్టివాడలో వృద్ధురాలు, సుంకపూర్లో యువకుడు వైరస్ బారినపడ్డారు.
‘పేట’లో 6...: పాయకరావుపేట మండలంలో మరో ఆరు కేసులు నమోదయ్యాయి. రాజుగారిబీడులో పురుషుడు, మహిళ, మంగవరంరోడ్డులో పురుషుడు, సీతారాంపురం గ్రామంలో యువకుడు, కందిపూడిలో వృద్ధుడు, అంకంపేటలో యువకుడు వైరస్ బారినపడ్డారు.
కశింకోటలో 4..: స్థానిక పీహెచ్సీ పరిధిలో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యాధికారి బి.రాజశేఖర్ చెప్పారు. కశింకోటలో ఇద్దరు యువకులు, వివాహిత, వెదురుపర్తిలో వృద్ధుడు వైరస్ బారినపడ్డారని చెప్పారు.