కరోనా కంట్రోల్‌ రూమ్‌

ABN , First Publish Date - 2020-03-27T10:24:46+05:30 IST

కేంద్రం ప్రకటించిన రూ. 1.70 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని బట్టి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కోరారు. ప్యాకేజీ వల్ల దాదాపు 80 కోట్ల మందికి లబ్ధి

కరోనా కంట్రోల్‌ రూమ్‌

 జాతీయ స్థాయిలో ఏర్పాటు...

ఇన్‌చార్జిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): కేంద్రం ప్రకటించిన రూ. 1.70 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని బట్టి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కోరారు.  ప్యాకేజీ వల్ల దాదాపు 80 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. బీజేపీ, ఇతర పార్టీల కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మానవత్వంతో ప్రతి రోజూ అయిదుగురికి భోజనం అందించాలని పిలుపునిచ్చారు. మనల్ని చూసి కరోనా భయపడి పారిపోయేలా వ్యవహరించాలని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. ఎవరూ దీన్ని తక్కువ అంచనా వేయకూడదని స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ విధులు నిర్వహించే వారు తప్ప మిగిలినవారు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి బయటికి రావద్దని కోరారు. జాతీయ స్థాయిలో ఏర్పాటైన కరోనా కంట్రోల్‌ రూమ్‌కు తాను ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నానని కిషన్‌రెడ్డి వెల్లడించారు. గురువారమే ఈ బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. జాతీయ స్థాయి కంట్రోల్‌ రూమ్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా శాఖలను సమన్వయం చేస్తుంటామని పేర్కొన్నారు.


తొలుత ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా ఆయన మాట్లాడారు. అనంతరం ఢిల్లీలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో చిక్కుకున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఇరు రాష్ట్రాల అధికారులను ఆదేశించారు. ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం లేక సరిహద్దుల్లో వేలాది మంది ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి పరిస్థితులు మంచిది కాదని సూచించారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమ సరిహద్దుల నుంచి పౌరులు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మహారాష్ట్ర నుంచి పొలాల మీదుగా నడిచి వస్తున్నట్లు తెలిసిందని, ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని చెప్పారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎప్పటి కప్పుడు సమీక్షలు నిర్వహించాలని, ప్రజలందరికీ నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణ, గ్రామీణప్రాంతాల్లో శానిటేషన్‌ నిర్వహించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించాలని చెప్పారు. సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మొద్దని, మూఢనమ్మకాలను విశ్వసించవద్దని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏ విషయాన్నీ దాచడం లేదని, అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తోందని స్పష్టం చేశారు.


అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన అమెరికాయే కరోనాను తట్టుకోలేకపోతోందని, ఆ పరిస్థితి మన దేశంలో రాకూడదని, అందుకు అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కష్టమైనప్పటికీ ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ను ప్రకటించారని గుర్తు చేశారు. ఎవరూ ఇళ్లలో నుంచి బయటికి రావద్దని, సమూహాలకు దూరంగా ఉండాలని కోరారు. ప్రజలు వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం సమన్వయం చేస్తుందన్నారు. ఈ బాధ్యతను కేంద్ర హోం శాఖ తీసుకుందని వెల్లడించారు. తమ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు, కంట్రోల్‌ రూమ్‌ ద్వారా సమీక్షలు జరుపుతున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మందులు, వైద్య పరికరాలను రాష్ట్రాలకు అందిస్తోందని చెప్పారు. ప్రతి బీజేపీ కార్యకర్త ఐదు భోజన ప్యాకెట్లు తయారు చేసి తినడానికి తిండిలేని వారికి అందించాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారని గుర్తు చేశారు. 


ఎక్కడివారక్కడే ఉండాలి

వారాణసీతో పాటు ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్నామని, స్వగ్రామాలకు వెళ్లడానికి సహకరించాలని కొందరు తెలుగువారు కోరుతున్నారని.. వారంతా ఎక్కడివారక్కడే ఉండాలని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎక్కడ ఉన్నా జాగ్రత్తలు పాటించాలని, ఇప్పుడు ప్రయాణాలు చేయవద్దని సూచించారు. తాను అక్కడి అధికారులతో మాట్లాడి వారికి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశానని వెల్లడించారు. కేంద్ర హోంశాఖ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ను పర్యవేక్షిస్తున్నందున తాను తెలుగు రాష్ట్రాల్లో పర్యటించలేకపోతున్నానన్నారు. రెండు రాష్ట్రాల డీజీపీలు, కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నానని వివరించారు. కాగా, ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులను కూడా కంట్రోల్‌ రూం నుంచి కిషన్‌రెడ్డి సమీక్షించి, తగు సూచనలు చేశారు. ప్రజలందరూ కరోనా నివారణ చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-03-27T10:24:46+05:30 IST