దుకాణాల్లో దొంగలు..
ABN , First Publish Date - 2020-04-05T09:45:51+05:30 IST
కరోనా కర్ఫ్యూతో మూతపడ్డ మద్యం దుకాణాల్లో దొంగలు హల్చల్ చేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ మద్యం దుకాణాలతోపాటు బార్లలోనూ ఇటీవల ఇలాంటి చోరీలు జరిగాయి.
కాపలాకు ఉద్యోగులు
రాకపోకలకు కర్ఫ్యూ కష్టాలు
నెల్లూరు (క్రైం), ఏప్రిల్ 4 : కరోనా కర్ఫ్యూతో మూతపడ్డ మద్యం దుకాణాల్లో దొంగలు హల్చల్ చేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ మద్యం దుకాణాలతోపాటు బార్లలోనూ ఇటీవల ఇలాంటి చోరీలు జరిగాయి. దీంతో సర్కారు వైన్ షాపులకు వాచ్మన్లు ఉన్నప్పటికీ ఆ దుకాణాల్లో పనిచేసే సూపర్వైజర్లు, హెల్పర్లకు కూడా కాపలా విధులు అప్పగిస్తూ అధికారులు ఉత్తర్వులిచ్చారు. కొందరిని ఉదయం పూట, మరి కొందరిని రాత్రి పూట వాచ్మన్కు తోడుగా ఉండాలని ఆదేశించారు.
దీనిపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున వాహనాలను అన్ని వేళల రోడ్డుపైకి రానివ్వకపోతుండడంతో మద్యం దుకాణాల వద్దకు చేరుకునేందుకు ఇటు సిబ్బంది, అటు వాచ్మన్లు అవస్థ పడుతున్నారు. మరోవైపు తప్పనిసరిగా షాపులకు వెళ్లాల్సిందేనని, లేకుంటే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తుండటంతో సిబ్బంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమ ఇబ్బందులను అధికారులకు తెలియజేస్తే పాసులు ఇస్తామంటున్నారని, ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయని వాపోతున్నారు.