కరోనా అనుమానంతో.. ఇంటినుంచి బయటకు వెళ్లి..
ABN , First Publish Date - 2020-08-03T18:03:48+05:30 IST
కరోనా భయంతో ఓ వృద్ధుడు కాల్వలో దూకేశాడు. ఇటీవల మండపేటలో..
కరోనా భయంతో.. కాల్వలో దూకేశాడు..!
వైద్యపరీక్షలు చేయించుకోకుండానే అనుమానంతో ఆత్మహత్యాయత్నం
మండపేట మండలం వెలగతోడులో ఘటన.. గాలిస్తున్న పోలీసులు
మండపేట(తూర్పు గోదావరి): కరోనా భయంతో ఓ వృద్ధుడు కాల్వలో దూకేశాడు. ఇటీవల మండపేటలో ఒక వ్యాపారి ఇలా ఆత్మహత్యకు పాల్పడగా మళ్లీ అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. మండపేట రూరల్ ఇన్చార్జి సీఐ అడపా నాగమురళి తెలిపిన వివరాల ప్రకారం.. మండపేట మండలం వెలగతోడుకు చెందిన రైతు చుండ్రు నరసింహారావు(60) మూడురోజులనుంచి జ్యరంతో బాధపడుతున్నాడు. ఆయన కుమారుడు ఫణి మండపేటలో, కుమార్తె హైదరాబాద్లో ఉంటున్నారు. వెలగతోడులో భార్యతో కలిసి ఆయన ఉంటున్నాడు.
జ్వరానికి గురైన తండ్రికి ఆదివారం మండపేటలో వైద్యపరీక్షలు చేయిస్తానని కుమారుడు తెలిపాడు. ఇంతలోనే ఆయనకి కరోనా అనుమానం వచ్చి శనివారం రాత్రి సమయంలో ఇంటినుంచి వెళ్లాడు. వెలగతోడు-మెర్నిపాడు మధ్య ఉన్న పంటకాల్వలో దూకేశాడు. పరీక్షలు కూడా చేయించుకోకముందే ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి సీఐ మురళి నేతృత్వంలో కాల్వలో గాలింపు చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.