రష్యాలో మృత్యు విలాపం
ABN , First Publish Date - 2020-05-23T08:27:33+05:30 IST
కరోనా కోరల్లో చిక్కి రష్యా విలవిల్లాడుతోంది. దేశంలో కరోనా కల్లోలం మొదలైన తర్వాత ఎన్నడూ లేనంతగా శుక్రవారం ఇక్కడ 150 మరణాలు సంభవించాయి. రష్యాలో ఎక్కువ కేసులు నమోదవుతున్నప్పటికీ మరణాలు...
- ఒక్కరోజే 150 మంది మృతి
- రోజువారీ లెక్కల్లో ఇదే అత్యధికం
- కొత్తగా 8,894 కేసులు
మాస్కో, మే 22: కరోనా కోరల్లో చిక్కి రష్యా విలవిల్లాడుతోంది. దేశంలో కరోనా కల్లోలం మొదలైన తర్వాత ఎన్నడూ లేనంతగా శుక్రవారం ఇక్కడ 150 మరణాలు సంభవించాయి. రష్యాలో ఎక్కువ కేసులు నమోదవుతున్నప్పటికీ మరణాలు తక్కువగా ఉండడంపై ప్రపంచ దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం మరణాలను తొక్కిపడుతోందనే విమర్శలు వస్తున్నాయి.
చైనాలో వూహాన్ తరహా లాక్డౌన్
చైనాలో కొత్తగా నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 82,971కి చేరుకుంది. ఇప్పటికీ 82 మంది కరోనా వైర్సకు చికిత్స తీసుకుంటుండగా.. లక్షణాలు లేకుండా పాజిటివ్గా వచ్చిన మరో 372 మందిని పరిశీలనలో ఉంచారు. దేశంలో రెండోసారి వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో చైనా అప్రమత్తమైంది. ఈశాన్య చైనాలోని షులాన్ నగరంలో వూహాన్ తరహా లాక్డౌన్ను అమలు చేస్తున్నారు. అపార్ట్మెంట్లకు సీల్ వేశారు. సింగపూర్లో కొత్తగా 614 కేసులు వెలుగుచూశాయి. కేసుల సంఖ్య 30,426కి పెరిగింది. పాకిస్థాన్లో 2,603 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 50,694కి చేరింది. తాజాగా 50 మందితో కలిపి మొత్తం మరణాలు 1,067కి చేరాయి.
600 మంది కబేళా సిబ్బంది క్వారంటైన్కు
తూర్పు నెదర్లాండ్స్లోని గ్రోన్లో ఉన్న కబేళాలో పనిచేస్తున్న 45 మందికి పాజిటివ్గా నిర్ధారణ కావడంతో 600 మంది సిబ్బందిని ప్రభుత్వం హోం క్వారంటైన్లో ఉండాలని ఆదేశించింది. ఈ ప్రాంతం జర్మనీ సరిహద్దులో ఉంది. 58 లక్షల జనాభా కలిగిన తమ దేశంలో 1.8 శాతం మంది కరోనా బారిన పడ్డారని డెన్మార్క్ ప్రకటించింది. ఈ దేశంలో 11,230 మందికి కరోనా సోకింది. కొత్తగా 48 మందికి పాజిటివ్గా తేలింది.
కొరియాలో స్మార్ట్ఫోన్తో కరోనా గుర్తింపు!
కరోనా కేసులను గుర్తించేందుకు దక్షిణ కొరియా ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనుంది. వైరస్ సోకిన వ్యక్తులెవరైనా దగ్గరకు వస్తే ఆపిల్, గూగుల్ సాయంతో స్మార్ట్ఫోన్ ద్వారా గుర్తించే టెక్నాలజీని పరిశీలిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీని సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నట్టు వివరించారు. దేశంలో మరో 20 కేసులు వెలుగుచూశాయి. పాఠశాలల ప్రారంభంతో కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది.