మృత్యుకోరలు.. కృష్ణాలో కరోనాకు మరో తొమ్మిది మంది బలి
ABN , First Publish Date - 2020-07-25T15:16:45+05:30 IST
కృష్ణా జిల్లావ్యాప్తంగా కోరలు చాచిన కరోనా వైరస్ రోజురోజుకూ మృత్యుపంజా విసురుతోంది. మహమ్మారి దెబ్బకు శుక్రవారం మరో తొమ్మిది మంది బలైపోయారు
కొత్తగా 359 మందికి సోకిన వైరస్
292 మంది డిశ్చార్జి
విజయవాడ(ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లావ్యాప్తంగా కోరలు చాచిన కరోనా వైరస్ రోజురోజుకూ మృత్యుపంజా విసురుతోంది. మహమ్మారి దెబ్బకు శుక్రవారం మరో తొమ్మిది మంది బలైపోయారు. కొత్తగా 359 మందికి వైరస్ సోకింది. వీరితో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,841కు చేరింది. మరణాల సంఖ్య అధికారికంగా 133గా ఉంది. కాగా, గడిచిన 24 గంటల్లో 292 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి చేరుకోగా, ఇంకా 1,156 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
వెలగలేరులో ఇద్దరు మృతి
వెలగలేరులో కరోనా పాజిటివ్తో ఇద్దరు మృత్యువాత పడ్డారని పీహెచ్సీ డాక్టర్ కుమారవర్మ తెలిపారు. ఇద్దరూ జ్వరంతో బాధపడుతూ స్థానికంగా ప్రైవేట్ వైద్యుల వద్ద వైద్యం చేయించుకున్నారని, వ్యాధి ముదరడంతో విజయవాడ జీజీహెచ్లో చేరి చికిత్స పొందుతూ మృతి చెందార న్నారు. దీంతో గ్రామంలో 30 మందికి కొవిడ్ టెస్టులు నిర్వహించామన్నారు. కాగా, మైలవరం మండలంలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.