24 గంటల్లో కరోనా నిర్ధారణ
ABN , First Publish Date - 2020-07-02T09:47:35+05:30 IST
శాంపిల్స్ సేకరించిన 24 గంటల్లోగా కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు వెల్లడించటానికి అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.
మొబైల్ నెంబర్లకు పరీక్ష రిపోర్టు
ఆంధ్రజ్యోతి, విజయవాడ : శాంపిల్స్ సేకరించిన 24 గంటల్లోగా కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు వెల్లడించటానికి అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. బుధవారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కరోనా టెస్ట్ల అమలు తీరును వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
జిల్లాలో అందుబాటులో ఉన్న నాలుగు మెషిన్లకు తోడు మరో మూడు బయోరాడ్ అధునాతనమైన ఆర్టీ-పీసీఆర్ మెషిన్లను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా శాంపిల్స్ సేకరించిన 24 గంటల్లోగా ఫలితాలు వెల్లడవుతాయని చెప్పారు. నిర్ధారణ ఫలితాలు సంబంధిత వ్యక్తుల ఫోన్ నెంబర్లకు పంపుతారని, ఫలితాలు రాని పక్షంలో సంబంధిత గ్రామ, వార్డు వలంటీర్కు ఆధార్ నెంబర్ ఇచ్చి, సమాచారం పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. కరోనా లక్షణాలు కనబడిన వారు వెంటనే టెస్టింగ్ సెంటర్లలో టెస్టు చేయించుకోవాలని చెప్పారు.