కూలీలేరి!?

ABN , First Publish Date - 2020-04-05T09:47:50+05:30 IST

కరోనా ప్రభావం ఉద్యాన పంటలపై కూడా తీవ్రంగా కనిపిస్తోంది. జిల్లాలో వేల ఎకరాల్లో నిమ్మ, బత్తాయి, పుచ్చ, కూరగాయలు సాగవుతున్నాయి.

కూలీలేరి!?

కోత దశలో నిమ్మ, బత్తాయి, పుచ్చ, కూరగాయలు

పంటను వదిలేస్తున్న ఉద్యాన రైతులు


నెల్లూరు, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి) : కరోనా ప్రభావం ఉద్యాన పంటలపై కూడా తీవ్రంగా కనిపిస్తోంది. జిల్లాలో వేల ఎకరాల్లో నిమ్మ, బత్తాయి, పుచ్చ, కూరగాయలు సాగవుతున్నాయి. ప్రస్తుతం వాటిలో చాలా వరకు కోతకు వచ్చాయి. అయితే రెండు వారాలుగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో చేతికొచ్చిన పంటను కోసేందుకు కూలీల్లేక రైతులు అవస్థ పడుతున్నారు. ఎలాగోలా కోత కోసినా రవాణా, మార్కెటింగ్‌ వసతుల్లేక, ఆశించిన ధరలు రాక లబోదిబోమంటున్నారు. గూడూరు డివిజన్‌లో నిమ్మసాగు ఎక్కువ. కానీ చాలా చోట్ల పంటను కోసేందుకు కూలీలు దొరక్క నిమ్మ కాయలు పండ్లుగా మారి రాలిపోతున్నాయి. అలా పండిన వాటిని మార్కెట్‌కు తీసుకువస్తే సగం రేటు కూడా దక్కడం లేదు.


ఉదయగిరి నియోజకవర్గంలో బత్తాయి పంట పరిస్థితీ ఇలాగే ఉంది. కూలీలు లేక, కొనేవారు రాకపోవడంతో చాలా మంది రైతులు కాయలను చెట్లకే వదిలేశారు. ఇక కోట, వాకాడు, చిట్టమూరు, నెల్లూరు రూరల్‌ వంటి మండలాల్లో పుచ్చ రైతులు కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. మిరప, టమోటా, బీర, వంగ వంటి ప్రధానమైన కూరగాయలు వందల ఎకరాల్లో సాగువుతున్నా, వాటికి మార్కెటింగ్‌ వసతి ఉన్నప్పటికీ కోసేందుకు కూలీల్లేకపోవడం, రవాణా కష్టాలు వంటివి రైతులను వెంటాడుతున్నాయి. 

Updated Date - 2020-04-05T09:47:50+05:30 IST