దుర్గగుడిలో దర్శనాలు నిలిపివేస్తారా..?
ABN , First Publish Date - 2020-08-08T15:25:08+05:30 IST
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనాలను మళ్లీ నిలిపివేయనున్నారా? ఆ దిశగా ఆలోచనలు జరుగుతున్నాయా? అంటే దుర్గగుడి ఉద్యోగులు, సిబ్బంది అవుననే అంటున్నారు. ఇటీవల కొండపై కరోనా కోరలు చాచింది.
ఆంధ్రజ్యోతి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనాలను మళ్లీ నిలిపివేయనున్నారా? ఆ దిశగా ఆలోచనలు జరుగుతున్నాయా? అంటే దుర్గగుడి ఉద్యోగులు, సిబ్బంది అవుననే అంటున్నారు. ఇటీవల కొండపై కరోనా కోరలు చాచింది. దేవస్థానంలో పనిచేసే వేదపండితుడు వైరస్ సోకి గురువారం మరణించారు. దేవస్థానంలోనే వివిధ కౌంటర్లు నిర్వహించే ప్రైవేట్ కాంట్రాక్టర్ కూడా బలైపోయారు. తాజాగా గురువారం ఈవో సురేష్బాబుకు వైరస్ సోకింది. ఇప్పటివరకు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 18 మంది ఉద్యోగులు, అర్చకులు, సిబ్బంది కరోనా బారినపడి ఆసుపత్రి పాలయ్యారు. ఇంకొందరు హోం క్వారంటైన్లో ఉన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మిగిలినవారు కూడా వైరస్ బారినపడే ప్రమాదముందని ఉద్యోగులు, సిబ్బంది భయంతో వణికిపోతున్నారు. మళ్లీ కొంతకాలం దర్శనాలను రద్దుచేసి అమ్మవారికి గతంలో మాదిరిగా ఏకాంత సేవలు కొనసాగించాలనే డిమాండ్ను దేవదాయశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఉద్యోగులు, సిబ్బంది శుక్రవారం నిర్వహించిన అంతర్గత సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది.
ఇన్చార్జి ఈవో వచ్చాక..
లాక్డౌన్ మొదటి రెండు నెలలు దుర్గగుడిలో దర్శనాలను రద్దుచేసి అమ్మవారికి ఏకాంత సేవలు నిర్వహించారు. లాక్డౌన్ నిబంధనలను సడలించాక దర్శనాలను పునఃప్రారంభించినప్పటి నుంచి కరోనా కొండపైకి కూడా ప్రవేశించింది. ఈ నేపథ్యంలో మళ్లీ దర్శనాలను కొంతకాలం రద్దు చేస్తేనే కొండపై వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తుందని ఉద్యోగులు చెబుతున్నారు. దసరా ఉత్సవాలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆలయ ఉద్యోగులందరూ ఆరోగ్యంగా ఉంటేనే విధులు సక్రమంగా నిర్వహించగలరని, లేదంటే ఇబ్బందులు ఎదురవు తాయని చెబుతున్నారు. ఈ అంశాన్ని దేవదాయశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అయితే, ఏ ప్రతిపాదనైనా ఈవో ద్వారానే కమిషనర్ కార్యాల యానికి పంపాలని, ప్రస్తుత ఈవో కరోనాతో ఆసుపత్రిలో ఉన్నందున ఇన్చార్జి ఈవోను నియమించాక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.