హలీం తినేవారు లేక వెలవెలబోతున్న హోటళ్లు..

ABN , First Publish Date - 2021-05-08T16:19:26+05:30 IST

పవిత్ర రంజాన్‌ మాసంలో 30 రోజుల పాటు హలీం అమ్మకాలు జోరుగా సాగేవి.

హలీం తినేవారు లేక వెలవెలబోతున్న హోటళ్లు..

హైదరాబాద్/ముషీరాబాద్‌ : పవిత్ర రంజాన్‌ మాసంలో 30 రోజుల పాటు హలీం అమ్మకాలు జోరుగా సాగేవి. కానీ కరోనా మహమ్మారి వల్ల ఈ సంవత్సరం హలీం అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీనికి తోడు రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించడంతో పోలీసులు రాత్రి 8 గంటలకే షాపులను మూయిస్తుండడంతో హలీం తినడానికి ఎవరు రావడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి వల్ల బయట తిండి ప్రజలు మానేయడంతో తినేందుకు ఆసక్తి చూపకపోవడంతో హలీం కేంద్రాలు వెలవెలబోతున్నాయి. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, చిక్కడపల్లి, ముషీరాబాద్‌, రాంనగర్‌, దయార మార్కెట్‌, కవాడిగూడ, భోలక్‌పూర్‌ తదితర ప్రాంతాలలో హలీం సెంటర్ల వద్ద తినేవారు లేక వెలవెలబోతున్నాయి. గత సంవత్సరం ప్రతి రోజు 300 ప్లేట్ల హలీం అమ్మేవారమని.. నేడు అందులో సగం కూడా అమ్ముడుపోవడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి 

కరోనా మహమ్మారి వల్ల హలీం అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. గత సంవత్సరం ప్రతి రోజు 180 ప్లేట్ల హలీం అమ్మేవారిమి. కానీ నేడు 60 కూడా అమ్మడం లేదు. ప్రజలు బయట తినేందుకు ఆసక్తి చూపకపోవడంతో వ్యాపారం పూర్తిగా తగ్గిపోయింది. వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి. - సలీం, వ్యాపారి, దయార మార్కెట్‌


బడీ మసీదులో సామూహిక ప్రార్థనలు

భోలక్‌పూర్‌లోని బడీ మసీదులో శుక్రవారం సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలు జనాలతో కిక్కిరిసిపోయాయి. ఎవరూ కొవిడ్‌ నిబంధనలు పాటించినట్లు కనిపించలేదు.

Updated Date - 2021-05-08T16:19:26+05:30 IST