కూలీల్లో కరోనా భయం
ABN , First Publish Date - 2021-05-16T04:59:06+05:30 IST
కరోనా మహమ్మారి గ్రామాల్లో వ్యవసాయ కూలీలను భయపెడుతోంది. ఏ రైతు కుటుంబమైనా కరోనా బారిన పడి... కోలుకున్నా సరే ఆ రైతు పొలాల్లోకి కూలి పనులకు వెళ్లాలంటే కూలీలు జంకుతున్నారు.
పలమనేరు రూరల్,మే 15 : కరోనా మహమ్మారి గ్రామాల్లో వ్యవసాయ కూలీలను భయపెడుతోంది. ఏ రైతు కుటుంబమైనా కరోనా బారిన పడి... కోలుకున్నా సరే ఆ రైతు పొలాల్లోకి కూలి పనులకు వెళ్లాలంటే కూలీలు జంకుతున్నారు. పలమనేరు మండలంలో చోటుచేసుకున్న ఘటన ఇందుకు ఓ ఉదాహరణ. టి.వడ్డూరు గ్రామానికి చెందిన నారాయణప్ప తనకున్న 1.20 ఎకరాల స్థలంలో రూ.80 వేలు ఖర్చుపెట్టి టమోటాపంట పండించాడు. కాయ పక్వానికి వస్తున్న తరుణంలో 25 రోజుల క్రితం వారి ఇంటిలో కరోనా వైరస్ సోకింది. ఆ రైతు భార్యతోపాటు, కోడలుకు కరోనా పాజిటివ్గా తేలింది. 14 రోజుల పాటు ఆ రైతు కుటుంబం ఇంటికే పరిమితమై కరోనా నుంచి కోలుకొని బయటపడ్డారు. ఈ క్రమంలో టమోటా పంట కోతదశకు చేరుకుంది. నారాయణప్ప కుటుంబంలో కరోనా ఉందనే ప్రచారం జరగడంతో అతడి పొలంలో పనులు చేయడానికి కూలీలు బయపడి రావడంలేదు. రైతు కుటుంబసభ్యులే టమోటాలు కోతకోసి మార్కెట్కు తరలించడానికి ఆటోను పిలువగా వారు కూడా రావడానికి భయపడుతున్నారు. కరోనా వైరస్ గురించి జనాల్లో ఎంతటి భయాందోళన ఉందో దీని బట్టి అర్థమవుతోంది.