పాఠశాలలకు కరోనా భయం

ABN , First Publish Date - 2021-08-23T05:51:51+05:30 IST

జిల్లాలో కరోనా కేసుల నమోదు తక్కువగా ఉన్నప్పటికీ.. తాజాగా పాఠశాలలకూ ఈ వైరస్‌ భయం పట్టుకుంది.

పాఠశాలలకు కరోనా భయం

పునఃప్రారంభం తర్వాతా నమోదవుతున్న కేసులు

నిర్ధారణ పరీక్షలు చేస్తే మరిన్ని బయటపడే అవకాశం


చిత్తూరు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసుల నమోదు తక్కువగా ఉన్నప్పటికీ.. తాజాగా పాఠశాలలకూ ఈ వైరస్‌ భయం పట్టుకుంది. సుమారు నాలుగు నెలల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేశారు. అయినప్పటికీ సోమల, శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాల్లోని పాఠశాలల్లో కొందరు విద్యార్థులు, ఉపాధ్యాయులకు పాజిటివ్‌ వచ్చింది. పాఠశాలలు తెరచేటప్పుడే వారానికోసారి ఆయా పాఠశాలల్లో ప్రతి తరగతిలోనూ కొందరు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ర్యాండమ్‌గా పరీక్షలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. ప్రస్తుతానికి వీటిని చేయకుండానే, అక్కడక్కడా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. ఈ పరీక్షలు ప్రారంభిస్తే మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు. 

శ్రీకాళహస్తి మండలం ఎంఎంసీ కండ్రిగ ప్రాథమిక పాఠశాలలో శనివారం ఐదుగురు విద్యార్థులకు వైరస్‌ సోకింది. పాఠశాలలో కొందరికి గురువారం పరీక్షలు చేయగా, వీరికి పాజిటివ్‌ ఉన్నట్లు ఫలితమొచ్చింది. అప్పటి దాకా వీరు తరగతులకు హాజరైనా పాఠశాల మూయలేదు. అలాగే, వెల్లంపాడు ప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయుడు వైరస్‌ లక్షణాలతోనే బడికి వచ్చారు. అనంతరం టెస్టు చేయించుకుని ఇంటివద్దే ఉండగా, ఫలితం పాజిటివ్‌గా వచ్చింది. ఈ పాఠశాలనూ కొనసాగిస్తున్నారు. 

తొట్టంబేడు మండలం కాసరం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడికి ఐదు రోజుల కిందట కరోనా నిర్ధారణ అయింద.  

పెనుమూరు మండలంలోని విడిదిపల్లెలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కారణంగా గ్రామంలోని పాఠశాలను మూసివేశారు.

సోమల మండలం నంజంపేట ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థినితో పాటు ఉపాధ్యాయురాలికీ బుధవారం కరోనా పాజిటివ్‌ వచ్చింది. లక్షణాలుండడంతో బయట పరీక్షలు చేసుకున్న వీరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. డీఈవో పురుషోత్తం ఆదేశాల మేరకు ఆ పాఠశాలకు సెలవు ప్రకటించారు.

Updated Date - 2021-08-23T05:51:51+05:30 IST