మూడు మండలాల్లో 35 మందికి కరోనా!
ABN , First Publish Date - 2022-01-20T06:23:24+05:30 IST
నియోజకవర్గంలో కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పలు పీహెచ్సీల్లో జరిపిన పరీక్షల ఫలితాలు బుధ వారం వెల్లడించగా, మాకవరపాలెం, నాత వరం, గొలుగొండ మండలాల్లో 35 మందికి వైరస్ నిర్ధారణ జరిగినట్టు తేలింది. దీంతో అంతా అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బంది సూచిస్తున్నారు.
మాకవరపాలెం, జనవరి 19 : నియోజకవర్గంలో కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పలు పీహెచ్సీల్లో జరిపిన పరీక్షల ఫలితాలు బుధ వారం వెల్లడించగా, మాకవరపాలెం, నాత వరం, గొలుగొండ మండలాల్లో 35 మందికి వైరస్ నిర్ధారణ జరిగినట్టు తేలింది. దీంతో అంతా అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బంది సూచిస్తున్నారు. మాకవరపాలెం మండ లంలో బుధవారం 16 మందికి కొవిడ్ నిర్ధారణ కావడం కలవరం పట్టించింది. మాకవరపాలెం పీహెచ్సీ పరిధిలో 101 మందికి పరీక్షలు జర పగా, 14 మందికి వైరస్ నిర్ధారణ జరిగినట్టు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ శ్రీవిద్య తెలిపారు. వీరిలో జి.వెంకటాపురం, జి.కోడూరు, జంగాలపల్లి, రామన్నపాలెం, యరకన్నపాలెం, శెట్టిపాలెం, గిడుతూరు గ్రామాలకు చెందిన వారు ఉన్నట్టు చెప్పారు. ఇదిలావుంటే, జి.కోడూరు హైస్కూల్లో 21 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్ వచ్చినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయిని జ్యోతికుమారి తెలిపారు.
గొలుగొండ మండలంలో 10..
గొలుగొండ/కృష్ణాదేవిపేట : మండలం లో పదిమందికి కరోనా నిర్ధారణ జరిగినట్టు గొలుగొండ, కృష్ణాదేవిపేట పీహెచ్సీల వైద్యాధికారులు డాక్టర్ శ్యామ్, డాక్టర్ వాసిరెడ్డి ప్రణతి తెలిపారు. గొలుగొండ పీహెచ్సీలో కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, నర్సింగబిల్లికి చెందిన మహిళకు, కొత్త ఎల్లవరానికి చెందిన పురుషు డికి వైరస్ నిర్ధారణ జరిందన్నారు. కృష్ణాదేవిపేట పీహెచ్సీ పరిధిలో సీహెచ్.నాగాపురంలో ఇద్దరు, కొంగసింగిలో ఒకరు, ఏఎల్పురంలో ఐదుగురు ఉన్నారు.
నాతవరంలో 9..
నాతవరం : మండలంలో తొమ్మిది మం దికి కరోనా నిర్ధారణ జరిగినట్టు పీహెచ్సీల వైద్యాధికారులు తెలిపారు. గునుపూడి పీహెచ్ సీలో సోమవారం కొవిడ్ పరీక్షలు నిర్వహిం చగా, ఆరుగురికి వైరస్ సోకినట్టు విశాఖ నుంచి సమాచారం అందిందన్నారు. వీరిలో గునుపూడిలో ఒకరు, గుమ్మిడిగొండలో ఒకరు, శృంగవరంలో ఒకరు కరోనా బారిన పడినట్టు వివరించారు. ఎంబీపట్నం, వైబీఅగ్రహారంలలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారన్నారు. నాతవరం పీహెచ్ సీ పరిధి చెర్లోపాలెంలో ఇద్దరికి, డి.యర్రవరంలో ఒకరికి పాజిటివ్గా తేలిందన్నారు.