ప్రభుత్వాసుపత్రిలో కరోనా కలకలం
ABN , First Publish Date - 2022-01-18T01:57:31+05:30 IST
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇటీవల మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితులు క్రమంగా పెరుగుతున్నారు.
విజయవాడ: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇటీవల మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితులు క్రమంగా పెరుగుతున్నారు. వారికి వైద్యసేవలందిస్తున్న వైద్యులు, సిబ్బంది కొవిడ్ బారినపడుతున్నారు. గత పదిహేను రోజుల వ్యవధిలో దాదాపు 30 మందికి పైగా జూనియర్ డాక్టర్లు, నర్సులు, వైద్యసిబ్బంది కరోనా బారినపడ్డారు. తాజాగా ఆసుపత్రి సూపరింటెండెంట్, పరిపాలన విభాగంలో మరో కీలక అధికారికి పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం వారు హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఇంకా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న పారా మెడికల్ సిబ్బంది, నాలుగో తరగతి ఉద్యోగులు కూడా వైరస్ బారినపడి ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. పేదలకు పెద్దదిక్కుగా ఉన్న ఈ పెద్దాసుపత్రిలోనే వైద్యులు, సిబ్బంది ఒక్కొక్కరుగా కరోనా బారినపడుతుండటంతో కరోనా వార్డుల్లో ఉన్న పాజిటివ్ బాధితులకు మెరుగైన వైద్యసేవలందించడంపై ప్రభావం పడుతోంది.