ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-04-08T22:13:31+05:30 IST
కరోనా మహమ్మారి కమ్ముకొస్తోంది. రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య వందలు దాటి వేలకు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 2,558 కరోనా కేసులు నమోదయ్యాయి.
అమరావతి: కరోనా మహమ్మారి కమ్ముకొస్తోంది. రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య వందలు దాటి వేలకు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 2,558 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 9,15,832కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో ఆరుగురు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 7,268 మరణాలు సంభవించాయి. ఏపీలో ప్రస్తుతం 14,913 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 8,93,651 మంది కోలుకున్నారు.
మరోవైపు రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ కొరత ఆరోగ్యశాఖను తీవ్రంగా వేధిస్తోంది. రాష్ట్రానికి సరిపడా డోస్లు ఇప్పటికిప్పుడు ఇవ్వలేమంటూ కేంద్రం కూడా చేతులెత్తేసింది. దీంతో మొదటి డోస్ వేయించుకున్న వారికి రెండో డోస్ అందుతుందో, లేదో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 4లక్షల వ్యాక్సిన్ డోస్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో మూడు రోజుల్లో అవీ పూర్తవుతాయి. అప్పుడు కోల్డ్చైన్ పాయింట్ల నుంచి రాష్ట్రస్థాయి వ్యాక్సిన్ స్టోరేజీ కేంద్రాల్లో నిల్వలు సున్నాకు చేరనున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసరంగా కోటి డోస్ల వ్యాక్సిన్ పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చింది.