కరోనా నుంచి కోలుకున్న నెలన్నర తర్వాత పాజిటివ్!
ABN , First Publish Date - 2020-08-13T14:33:44+05:30 IST
రాజధాని ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కరోనాకు చికిత్సపొంది, డిశ్చార్జ్ అయిన ఇద్దరు బాధితులకు తిరిగి కరోనా సోకింది. దీనిపై ఆసుపత్రి నోడల్ అధికారి డాక్టర్ అజిత్...
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కరోనాకు చికిత్సపొంది, డిశ్చార్జ్ అయిన ఇద్దరు బాధితులకు తిరిగి కరోనా సోకింది. దీనిపై ఆసుపత్రి నోడల్ అధికారి డాక్టర్ అజిత్ జైన్ మాట్లాడుతూ వీరిద్దరూ మళ్లీ కరోనా బారిన ఎలా పడ్డారో ఇంకా నిర్ధారించలేదన్నారు. దీనిపై ఆసుపత్రి బృందం విచారణ చేస్తున్నదన్నారు. శాంపిల్స్ సేకరించడంలో లోపం కారణంగా ఇలా జరగవచ్చని భావిస్తున్నామన్నారు. అలాగే కరోనా రిపోర్టులలో తప్పులు చోటు చేసుకుంటున్న ఉదంతాలు ఉన్నాయన్నారు. ఈ వైరస్ కఫం లేదా శ్లేష్మంలో 39 రోజుల వరకు జీవించగలదన్నారు. కరోనా సోకిన వ్యక్తికి చికిత్స అందించాక, అతనిలో ఇంకా ఇన్ఫెక్షన్ ఉందా? అనే దానిపై ఖచ్చితమైన ఆధారాలు కనుగొనలేదని కొందరు వైద్యులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ బాధితులు కోలుకున్నాక తిరిగి పాజిటివ్గా మారడం ఆందోళన కలిగించే విషయంగా మారిందని నిపుణులు భావిస్తు్న్నారు.