కరోనా భయంతో ఊళ్లు వదిలి వెళ్లిపోతున్న జనం

ABN , First Publish Date - 2020-04-05T19:04:56+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది.

కరోనా భయంతో ఊళ్లు వదిలి వెళ్లిపోతున్న జనం

అదిలాబాద్: జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. రిమ్స్ వైద్యుడు ఒకరు ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చినట్లు తేలింది. మరోవైపు కరోనా భయంతో పలు గ్రామాల ప్రజలు ఊళ్లు వదిలి వెళ్లిపోతున్నారు. అదిలాబాద్‌కు సంబంధించి నిన్న ఒక్కరోజే 10 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో రిమ్స్ వైద్యుడు చేసిన నిర్వాకం.. వైద్యులపై నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. రిమ్స్‌లో ఆప్టమాలజీ విభాగం హెడ్‌గా పనిచేస్తున్న డాక్టర్ మార్చి రెండో వారంలో మర్కజ్ ప్రార్థనలకు వెళ్లారు. తిరిగి అదిలాబాద్ చేరుకున్న ఆయన యధావిధిగా విధులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న రిమ్స్ వైద్యులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు ఆ వైద్యుడిని పరీక్షల నిమిత్తం క్వారంటైన్‌కు తరలించారు.


గ్రామీణ ప్రాంతాలకు కరోనా వ్యాప్తి చెందడంతో నేరేడిగొండ గ్రామంలో ముగ్గురికి కరోనా పాజిటీవ్ వచ్చింది. ఆ ముగ్గురు ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారే. దీంతో మధుర కాలనీ ప్రజలు వారంతా భయంతో తమ ఇళ్లను ఖాళీ చేసి పంట పొలాల్లోకి వెళ్లిపోయారు. అక్కడ గుడిసెలు వేసుకుని కుటుంబాలతో ఉన్నారు. కరోనా పూర్తి స్థాయిలో పోయిన తర్వాతే గ్రామంలోకి వస్తామని వారు చెబుతున్నారు. 

Updated Date - 2020-04-05T19:04:56+05:30 IST