కరోనా కలకలం

ABN , First Publish Date - 2022-01-17T06:46:36+05:30 IST

జిల్లాలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. నిత్యం సందర్శకులతో కిటకిటలాడే ప్రభుత్వ కార్యాలయాలకు కొవిడ్‌ సోకింది. ఇప్పటికే కొన్ని కార్యాలయాల్లో అధికారుల నుంచి సిబ్బంది వరకు పలువురు కరోనా బారిన పడ్డారు.

కరోనా కలకలం


కలెక్టరేట్‌లో పలువురికి పాజిటివ్‌

వైరస్‌ బారిన అధికారులు, సిబ్బంది  8 నేటి స్పందన కార్యక్రమం రద్దు

విద్యాసంస్థలు పునః ప్రారంభం కానుండడంతో తల్లిదండ్రుల్లో టెన్షన్‌


విశాఖపట్నం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): 

జిల్లాలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. నిత్యం సందర్శకులతో కిటకిటలాడే ప్రభుత్వ కార్యాలయాలకు కొవిడ్‌ సోకింది. ఇప్పటికే కొన్ని కార్యాలయాల్లో అధికారుల నుంచి సిబ్బంది వరకు పలువురు కరోనా బారిన పడ్డారు. చిన్నపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తుండడంతో కొందరు తేలికగా తీసుకుంటుండగా, పరీక్షలు చేయించుకుని, పాజటివ్‌ వచ్చిన వారు విధులకు సెలవు పెడుతున్నారు. సంక్రాంతి సెలవులతో గురువారం నుంచి కార్యాలయాలకు దూరంగా ఉన్న అధికారులు, సిబ్బంది సోమవారం విధులకు హాజరు కానున్నారు. సంక్రాంతి షాపింగ్‌, సొంత ఊళ్లకు వెళ్లి రావడంతో పలువురికి కరోనా సోకే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారిపై ఆంక్షలు విధించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. 


ప్రభుత్వ కార్యాలయాల్లో కొవిడ్‌ టెన్షన్‌ 

గ్రామీణ ప్రాంత కార్యాలయాల్లో పనిచేసి సిబ్బందిలో పలువురికి ఇప్పటికే కరోనా సోకింది. చోడవరం ఆస్పత్రిలో నలుగురికి పాజిటివ్‌ రావడంతో వైద్యం కోసం వెళ్లేందుకు రోగులు వెనుకంజవేస్తున్నారు. కలెక్టరేట్‌లో పలువురు సిబ్బందికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో మిగిలిన వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. కలెక్టర్‌ పేషీలోని సిబ్బందిలో ఒకరికి కరోనా సోకడంతో అప్రమత్తమయ్యారు. చివరకు కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున కూడా బంగ్లా నుంచి విధులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 


విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన 

సంక్రాంతి సెలవుల తరువాత సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరచుకోనున్నాయి. వారం రోజులుగా కొవిడ్‌ కేసులు పెరుగుతుండం, దీనికి తోడు పిల్లలు, టీచర్లు సొంత ఊళ్లకు వెళ్లిరావడంతో విద్యార్థుల తల్లిదండ్రు ల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠశాలలు, కళాశాలలకు పంపకపోతే తరగతులు మిస్‌ అవుతారని, పంపితే కరోనా సోకుతుందేమోననే భయంలో వారిలో నెలకొంది. కాగా తెలంగాణలో విద్యాసంస్థలకు నెలాఖరు వరకు సెలవులు ప్రకటించినా, మన రాష్ట్రంలో సెలవులిచ్చేది లేదని విద్యాశాఖా మంత్రి సురేష్‌ ఆదివారం గుంటూరులో స్పష్టం చేయడంతో టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.  



జిల్లాలో మరో 1028 మందికి కొవిడ్‌

విశాఖపట్నం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. రోజు వారీ కేసులు రెట్టింపుస్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా ఆదివారం 19.45 శాతం పాజిటివిటీతో 1,028 మందికి కరోనా సోకింది. వీరిలో 18 మంది ఆస్పత్రిలో చేరగా, మిగిలిన వారంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వీటితో ఇప్పటి వరకు జిల్లాలో 1,65,425 మందికి కరోనా బారిన పడ్డారు. చికిత్స పొందుతూ ఆదివారం 101 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 1,58,694కు చేరింది. మరో 5,619 మంది చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌ బారిన పడి ఇప్పటివరకు 1,112 మంది మృత్యువాత పడ్డారు.  

మూడో వేవ్‌లో అత్యధికం...

మూడోవేవ్‌లో ప్రతి రోజూ వందలాది కేసులు వెలుగుచూస్తున్నాయి. అత్యధికంగా శనివారం 1,103 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల పాటు ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, వైరస్‌ సామాజిక వ్యాప్తి దశకు చేరుకున్నట్టు తెలుస్తోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.   


Updated Date - 2022-01-17T06:46:36+05:30 IST