తండ్రి పోయినా.. రానన్న కుమారుడు

ABN , First Publish Date - 2021-05-08T09:01:19+05:30 IST

కరోనా కోరల్లో చిక్కి ప్రాణాలు కోల్పోతున్న వారిని తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులెవరూ ముందుకురాని సంఘటనలు చూస్తూనే ఉన్నాం

తండ్రి పోయినా.. రానన్న కుమారుడు

కరోనా నెగిటివ్‌ అయినా అనాథశవంగా అంత్యక్రియలు


ఆకివీడు, మే 7: కరోనా కోరల్లో చిక్కి ప్రాణాలు కోల్పోతున్న వారిని తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులెవరూ ముందుకురాని సంఘటనలు చూస్తూనే ఉన్నాం. కానీ.. తండ్రి కొవిడ్‌తో కాకుండా అనారోగ్యంతో చనిపోయాడని తెలిసినా.. వచ్చి తలకొరివి పెట్టేందుకు ఓ కొడుకు నిరాకరించాడు. దీంతో అనాథశవంగా అంత్యక్రియలు పూర్తిచేసిన విషాద ఘటన ఇది. కృష్ణా జిల్లా చినతాడినాడ యువరంపాడుకు చెందిన కలిదిండి రాంబాబు (63) తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. దివ్యాంగుడైన అల్లుడు నరసింహరావు మోటారుసైకిల్‌పై కూర్చోబెట్టుకుని వైద్యం నిమిత్తం శుక్రవారం ఆకివీడు సీహెచ్‌సీకి తీసుకొచ్చాడు. వైద్యుడు రంగారావు పరీక్షించి అప్పటికే చనిపోయాడని తెలిపారు. అనంతరం కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్‌ వచ్చింది. అల్లుడు దివ్యాంగుడు కావడంతో సీహెచ్‌సీ సిబ్బంది మృతుడి కుమారుడికి.. ఫోన్‌ చేసి తండ్రి చనిపోయిన సమాచారం అందించారు. ప్రస్తుతం తాను ఊరిలో లేను మీరే కానిచ్చేయండి అంటూ ఆ కొడుకు సమాధానమిచ్చాడు. దీంతో సిబ్బంది అవాక్కయ్యారు. చినతాడినాడ సర్పంచ్‌కు సమాచారం అందించగా కార్యదర్శి, సచివాలయ ఉద్యోగులను పంపించారు. కైలాస నిలయం వాహనంలో మృతదేహాన్ని యువరంపాడుకు తరలించి వారే అంత్యక్రియలు పూర్తిచేశారు.

Updated Date - 2021-05-08T09:01:19+05:30 IST