915 మందికి పాజిటివ్
ABN , First Publish Date - 2021-05-18T05:51:33+05:30 IST
జిల్లాలో సోమవారం 4,250 మందికి శాంపిల్స్ తీయగా 915 మందికి కొత్తగా వైరస్ సోకింది. గడిచిన 24 గంటల్లో ఏడుగురు మృతి చెందగా.. మరణాల సంఖ్య 639కు చేరింది.
- మరో ఏడుగురి మృతి
కర్నూలు(హాస్పిటల్), మే 17: జిల్లాలో సోమవారం 4,250 మందికి శాంపిల్స్ తీయగా 915 మందికి కొత్తగా వైరస్ సోకింది. గడిచిన 24 గంటల్లో ఏడుగురు మృతి చెందగా.. మరణాల సంఖ్య 639కు చేరింది. ఇప్పటివరకు జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 1,01,202కు చేరగా.. యాక్టివ్ కేసులు 7,530 ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని 93,033 మంది డిశ్చార్జి అయ్యారు.
రక్తదాత రాగిమాన్ రమేష్ మృతి
- 77 సార్లు రక్తదానం
కర్నూలు(హాస్పిటల్), మే 17: కర్నూలు నగరంలో ఎవరికైనా ఆపదలో రక్తం అవసరమైతే ముందుకు గుర్తుకు వచ్చే పేరు రాగిమాన్ రమేష్(45)ను కరోనా కాటేసింది. బేతంచెర్ల మండలం శంకలాపురానికి చెందిన రమేష్ యువభారత్ సేవా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారు. రెడ్ క్రాస్ సంస్థలో సభ్యుడైన ఈయన ఇప్పటివరకు 77 సార్లు రక్తదానం చేశారు. ప్రతి నెలా తలసేమియా చిన్నారులకు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో రక్తాన్ని అందిస్తున్నారు. ఈయనకు కరోనా పాజిటివ్ రావడంతో హోం ఐసొలేషన్లో ఉన్నారు. పరిస్థితి విషమించడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఈయన మృతి పట్ల జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్, సభ్యులు సంతాపం తెలిపారు.
వివాహాలకు 20 మందికే అనుమతి
- ఇన్చార్జి కలెక్టర్ ఆదేశం
కర్నూలు(కలెక్టరేట్), మే 17: జిల్లాలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులు వివాహాలకు 20 మందిని మాత్రమే అనుమతించాలని, లేకుంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసులు పెట్టి సీజ్ చేస్తామని ఇన్చార్జి కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. వివాహాలకు ముందు స్థానిక రెవెన్యూ అధికారులతో అనుమతి తీసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్ను సీజ్ చేయడంతో పాటు సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.