హెల్ప్ లైన్కి కరోనా బాధితుడు ఫోన్... ‘చస్తే చావు’ అంటూ సమాధానం!
ABN , First Publish Date - 2021-04-17T17:44:14+05:30 IST
కరోనా సెకెండ్ వేవ్ అందరినీ మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
లక్నో: కరోనా సెకెండ్ వేవ్ అందరినీ మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా కేసులకు సంబంధించిన గణాంకాలు భయపెడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కరోనా బాధితుల విషయంలో వైద్య సిబ్బంది కఠినంగా వ్యవహరించిన ఉదంతం వెలుగు చూసింది. యూపీ సర్కారు కరోనా బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ఔషధాలను వారి ఇంటికే చేరవేసే ఏర్పాటు చేసింది. ఇందుకోసం కరోనా వైరస్ కమాండ్ సెంటర్ ప్రారంభించారు.
అలాగే ఒక హెల్పలైన్ పోన్ నంబర్ ఏర్పాటు చేశారు. అయితే ఈ వ్యవస్థపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లక్నోకి చెందిన సంతోష్ కుమార్ ఏప్రిల్ 10న తన భార్యతో పాటు కరోనా టెస్టు చేయించుకున్నారు. పాజిటివ్ రావడంతో ఇద్దరూ హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఈ నేపధ్యంలో సంతోష్ కుమార్... హెల్ప్ లైన్కు ఫోన్చేసి ఔషధాల గురించి వాకబు చేశాడు. అటువైపు నుంచి హెల్ప్ లైన్ సిబ్బంది ఐసోలేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. దీంతో సంతోష్ తనకు ఎటువంటి యాప్ గురించి తెలియదన్నాడు. వెంటనే అటువైపు నుంచి ‘అయితే చస్తే చావు‘ అంటూ సమాధానం వినిపించింది. ఈ ఘటన జరిగిన వెంటనే సంతోష్ కుమార్ ఈ విషయమై యూపీ సీఎంకు, జిల్లా అధికారులకు లేఖ రాశారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.