ఆస్పత్రి పై నుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-05-14T08:14:24+05:30 IST
విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిపై నుంచి కిందకు దూకి గుంటూరుకు చెందిన కరోనా బాధితుడు (55) ఆత్మహత్యకు పాల్పడినట్టు గురువారం గవర్నర్పేట పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.
విజయవాడ(వన్టౌన్), మే 13: విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిపై నుంచి కిందకు దూకి గుంటూరుకు చెందిన కరోనా బాధితుడు (55) ఆత్మహత్యకు పాల్పడినట్టు గురువారం గవర్నర్పేట పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. గుంటూరు వికాస్నగర్లో కొల్లి నాగిరెడ్డి (55) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. నాగిరెడ్డికి ఈ నెల 3న జ్వరం రావడంతో గుంటూరు వచ్చారు. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటూ మందులు వాడుతున్నాడు. జ్వరం ఎక్కువగా రావడంతో 8వ తేదీన సిటి స్కాన్ తీయించగా పాజిటివ్ అని తెలిసింది. ఆరోజు సాయంత్రం కుటుంబ సభ్యులు నాగిరెడ్డిని పోలీసు కంట్రోల్ రూమ్ సమీపంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. నాగిరెడ్డి హాస్పటల్ 4వ ఫ్లోర్లో చికిత్స పొందుతున్నాడు. హాస్పటల్ వద్ద నాగిరెడ్డి పెద్ద కుమారుడు కార్తీక్రెడ్డి ఉంటూ తండ్రికి కావలసిన మందులు, ఆహార పదార్థాలు అందిస్తున్నాడు. కార్తీక్ గురువారం ఉదయం ఎనిమిది గంటలకు తండ్రితో మాట్లాడి గుంటూరులో ఇంటికి వెళ్లాడు. ఉదయం 9.40 గంటలకు కార్తీక్రెడ్డి హాస్పటల్లో పని చేసే సదానంద్కు ఫోన్ చేసి తండ్రి గురించి అడిగాడు. నాగిరెడ్డి చికిత్స పొందుతున్న బెడ్పై నుంచి లేచి 4వవ ఫ్లోర్ కిటికి నుంచి కిందకు దూకి చనిపోయాడని సదానంద్ చెప్పాడు. కార్తీక్ గుంటూరు నుంచి వచ్చి చూడగా తండ్రి హాస్పటల్ గ్రౌండ్ ఫ్లోర్లో వస్త్ర దుకాణం ఎదురుగా రక్తపు మడుగులోపడి చనిపోయి ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.