కరోనాకు ఓ కుటుంబం బలి.. పాజిటివ్ వచ్చిందన్న భయమే..
ABN , First Publish Date - 2020-08-13T16:05:57+05:30 IST
కరోనాతో కాదు.. కేవలం పాజిటివ్ వచ్చిందన్న భయమే ఆ కుటుంబాన్ని కబళించింది. తండ్రీకొడుకులను బలితీసుకుంది. ప్రాణానికి ప్రాణమైన కుమారుడికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ కావడంతో జీర్ణించుకోలేని తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు.
కుమారుడికి కరోనా.. మనోవేదనతో తండ్రి మృతి
తండ్రి మరణం తట్టుకోలేక కుమారుడి మృతి
విషాదంలో మార్వాడి కుటుంబం
కాజీపేట(వరంగల్): కరోనాతో కాదు.. కేవలం పాజిటివ్ వచ్చిందన్న భయమే ఆ కుటుంబాన్ని కబళించింది. తండ్రీకొడుకులను బలితీసుకుంది. ప్రాణానికి ప్రాణమైన కుమారుడికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ కావడంతో జీర్ణించుకోలేని తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. తండ్రి మరణాన్ని కళ్లారా చూడలేక కుమారుడు తండ్రి దశదిన ఖర్మ రోజు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద సంఘటన కాజీపేట రహ్మత్నగర్కు చెందిన ఓ మార్వాడి కుటుంబంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి...
కాజీపేటకు చెందిన మదన్లాల్ ఉపాధ్యాయ (70) ఓ జనరల్ స్టోర్స్ నడుపుతుంటారు. ఇతడికి ఇద్దరు కుమారులు ఇంటికి పెద్ద కుమారుడైన ఈశ్వర్ ఉపాధ్యాయ (45) ప్లాస్టిక్ వస్తువులు, జనరల్ స్టోర్స్ నడుపుతుంటాడు. కొన్ని రోజులుగా ఈశ్వర్ ఉపాధ్యాయ అనారోగ్యానికి గురైయ్యాడు. అతడికి టెస్టు చేయిస్తే కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో తన కుమారుడు మరణిస్తాడన్న తీవ్ర భావోద్వేగానికి గురైన తండ్రి గుండె పోటుతో మృతి చెందాడు. ఓ వైపు కరోనా.. మరో వైపు తండ్రి మరణంతో క్వారంటైన్లో ఉండి 11 రోజులుగా కుమిలి పోయాడు కుమారుడు ఈశ్వర్ ఉపాధ్యాయ. కనీసం తండ్రి దహన సంస్కారాలు తన చేతులతో చేయలేక పోయానన్న బాధతో 11 రోజుల కార్యక్రమం చేయాలనుకున్నాడు.
ఈశ్వర్ మంగళవారం వైద్యుల సలహాతో ఆరోగ్యం పూర్తిగా కోలుకుందని నిర్ధారించుకున్నాడు దీంతో మంగళవారం రాత్రి కుటుంబీకులకు 11వ రోజు కార్యక్రమాలకు హాజరుకావాలని ఫోన్ చేశాడు. బుధవారం తెల్లవారు జామున నాలుగు గంటలకే లేచి బిల్డింగ్ పైనుంచి కిందికి దిగాడు. అతడికి తండ్రి జ్జాపకాలు తీవ్రంగా కలిచివేయడంతో ఏడుస్తూనే కుప్పకూలిపోయాడు. బంధువులు ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందాడని ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి కుమారుల మరణాలు ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి.