ఢిల్లీ నుంచి తిరిగొచ్చి ఇద్దరూ విధుల్లోకి.. తీరా ఇప్పుడు కరోనా పాజిటివ్ రావడంతో..
ABN , First Publish Date - 2020-04-04T16:53:26+05:30 IST
నూజివీడులో భయాందోళనలు నెలకొన్నాయి. ఢిల్లీలో మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన కొందరు కరోనా బారిన పడటంతో పట్టణవాసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఇద్దరికి
నూజివీడులో భయం భయం
ఇద్దరికి పాజిటివ్ రావడంతో రెడ్జోన్గా ప్రకటన
నూజివీడు ప్రముఖ విద్యాసంస్థలో బోధనా సిబ్బందిగా గుర్తింపు
ఢిల్లీ ప్రార్థనల నుంచి వచ్చాక ఉపాధ్యాయులతో సమావేశం, ప్రసాదం పంపిణీ
నూజివీడు (కృష్ణా జిల్లా) : నూజివీడులో భయాందోళనలు నెలకొన్నాయి. ఢిల్లీలో మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన కొందరు కరోనా బారిన పడటంతో పట్టణవాసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్టు వైద్య పరీక్షల్లో వెల్లడి కాగా, మరో ముగ్గురి ఫలితాలు రావాల్సి ఉంది. అయితే, పాజిటివ్ వచ్చిన ఇద్దరు నూజివీడులోని ఓ ప్రముఖ విద్యాసంస్థలో బోధనా సిబ్బంది కావడంతో విద్యార్థులు, తోటి సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. పాజిటివ్ వచ్చిన ఇద్దరూ ఢిల్లీ ప్రార్థనల నుంచి వచ్చాక విధుల్లో చేరడమే కాకుండా, ఉపాధ్యాయులతో సమావేశం కూడా నిర్వహించారని తెలిసింది. ఈ సమావేశంలోనే ఢిల్లీ నుంచి తెచ్చిన ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టారు.
అంతేకాదు.. సహచరులను ఆత్మీయ ఆలింగనం కూడా చేసుకోవడం, పలువురు విద్యార్థులతో మాట్లాడటంతో అందరిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఆ తర్వాత కరోనా వ్యాప్తి అరికట్టడానికి విద్యాసంస్థకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లిపోయారు. నూజివీడుకు చెందిన వారిలో ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారితో పాటు కలిసి అదే రైల్లో పంజాబ్లో విద్యనభ్యసిస్తున్న స్థానిక విద్యార్థి ఒకరు ఢిల్లీ నుంచి వచ్చారు. అతనికి కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తమై నూజివీడు పట్టణాన్ని రెడ్జోన్లో ఉంచారు. వీరు గతనెల 22వ తేదీ జనతా కర్ఫ్యూ జరిగిన రోజు నూజివీడులోని తిరువూరు రోడ్డులో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో విందు ఇచ్చినట్టు తెలుస్తోంది.